రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది. చేస్తున్న అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించకపోవడంతో రాష్ట్ర ప్రజానీకంపై అప్పుల భారం పెరిగిపోతోంది.
2017–18 మార్చి నాటికి రాష్ట్ర అప్పు రూ.2,16,026.59 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్థంగా తయారైంది. చేస్తున్న అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించకపోవడంతో రాష్ట్ర ప్రజానీకంపై అప్పుల భారం పెరిగిపోతోంది. గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల అప్పు ప్రకారం తలసరి అప్పు రూ.38,597 కాగా 2017–18లో చేసే అప్పులతో తలసరి అప్పు రూ.43,205కు పెరగనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరం మార్చికి రాష్ట్ర అప్పు రూ.2,16,026.59 కోట్లకు పెరుగుతుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు. ఈ అప్పులో రూ.33,477.52 కోట్లు తెలంగాణ, ఏపీ మధ్య పంపిణీ చేయాల్సి ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల మేరకు రాష్ట్ర అప్పుల మొత్తం రూ.1,92,983.97 కోట్లుగా పేర్కొన్నారు. అంటే 2017–18 ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి కొత్తగా రూ.23,042.62 కోట్ల అప్పు చేయనున్నట్లు స్పష్టం అవుతోంది.