అసెంబ్లీ సమావేశాల్లో కాల్మనీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే కుట్రపూరితంగా ఎమ్మెల్యే రోజాను ఏడాది
నరసరావుపేట రూరల్ : అసెంబ్లీ సమావేశాల్లో కాల్మనీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే కుట్రపూరితంగా ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు విమర్శించారు. పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ కాసు వెంకట కృష్ణారెడ్డి స్వగృహాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో వెలుగుచూసిన కాల్మనీ వ్యవహారంలో నింధితులందరూ టీడీపీ వాళ్లేనని, వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు.
శాసనసభలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమన్నారు. ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడం సరికాదన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెట్టడం నరసరావుపేటకు మచ్చగా మిగులుతుందన్నారు. ముఖ్యమైన బిల్లులు, ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సి ఉండగా వాటి గురించి పట్టించుకోకుండా పరస్పరం ఆరోపణలు చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. పార్టీ నాయకులు పడాల చక్రారెడ్డి, కపలవాయి రమేష్, మంజూర్, దుర్గాబాబు, బాషా పాల్గొన్నారు.