వైఎస్‌ జగన్‌కి ఏమైనా జరిగితే ఊరుకోం : రోజా

Roja fires on Telugu desham over attack on YS Jaganmohanreddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విశాఖ ఎయిర్‌ పోర్టులో అది కూడా వీఐపీ లాంజ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరగడం చూస్తుంటే దీని వెనక కుట్రకోణం ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఒక వ్యక్తి చిరునవ్వుతో సెల్ఫీ తీసుకుంటూ వైఎస్‌ జగన్‌పై దాడి చేయడం చూస్తుంటే ఆవేశంతోనో లేక కక్ష్యపూరితంగానో కాదని, ఒక ప్లాన్‌ ప్రకారం ఎవరో వెనకుండి చేయించారని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు. ఎయిర్‌పోర్టులో ఉండేది స్థానిక పోలీసులు కాదు కాబట్టి తమకు సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకునే అవకాశం ఉందన్నారు. గతంలో కూడా ప్రత్యేక హోదా కోసం క్యాండిల్‌ ర్యాలీ చేయాలని బయలుదేరిన వైఎస్‌ జగన్‌ను ఇదే విశాఖ ఎయిర్‌పోర్టులో రన్‌వే మీదే స్థానిక పోలీసులు సివిల్‌ డ్రెస్సుల్లో వచ్చి నిర్భందించడం అందరం కళ్లారా చూశామన్నారు. వైఎస్‌ జగన్‌పై దాడి తెలుగు దేశ ప్రభుత్వ వైఫల్యమన్నారు. ప్రతిపక్షనాయకుడికే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో వెయిటర్ కత్తి పట్టుకొని తిరుగుతుంటే గాజులు తొడుక్కొన్నారా? అని మండిపడ్డారు. రక్షణ, నిఘా వ్యవస్థ ఫెయిల్ అయ్యిందన్నారు. 

వైఎస్‌ జగన్‌కి ఏం జరిగినా ఊరుకోబోమని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబును తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు. దాడి చేసిన వ్యక్తి వెనక ఎవరున్నారో విచారణ చేసి వెంటనే అరెస్ట్‌ చేయాలన్నారు. లేకపోతే చాలా తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. భుజంపైన గాయం అయిన తీరు చూస్తుంటే గోంతు లక్ష్యంగానే ఈ దాడి జరిగిందని అర్థం అవుతోందన్నారు. జగన్‌ త్వరగా స్పందించడం వల్లే  తప్పుంచుకోగలిగారని తెలిపారు. కత్తిని చూస్తుంటే దానికి ఏమైనా విషం పూసి దాడి చేశారో అర్థం కావట్లేదన్నారు. వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి కత్తికి విషం లాంటిది ఏమైనా పూసారో నిర్ధారించాలని రోజా అన్నారు. వైఎస్‌ జగన్‌పై దాడి చేశారని తెలియడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరూ తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top