పోరాట ఫలితం.. తెలంగాణ | Result of the action .. Telagan | Sakshi
Sakshi News home page

పోరాట ఫలితం.. తెలంగాణ

Aug 18 2013 4:29 AM | Updated on Apr 7 2019 4:30 PM

ప్రత్యేక రాష్ట్రం కోసం యాభైఆరేళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు.

ఆత్మకూరు, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్రం కోసం యాభైఆరేళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఆత్మకూరులో శనివారం జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్గాల వెంకట్రాంరెడ్డి నేతృత్వంలో జరిగిన తెలంగాణ విజయోత్సవ ర్యాలీకి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఇచ్చిందన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది బూటకపు ఉద్యమమని పేర్కొన్నారు. కష్టసుఖాల్లో వెన్నంటి ఉండే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని కోరారు.

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి సోనియాకు కానుకగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ విషయంలో స్పష్టతతోఉన్న బీజేపీకి లేనిబాధ సీమాంధ్రలో ఉన్న కాంగ్రెస్ గ్రూపునకు ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్‌ల జాగకోసమే సీమాంధ్రుల పోరాటమని, వారికి డబ్బు బలముంటే తమకు గొంతు బలముందని చెప్పారు. ఆంటోని కమిటీకి చెప్పడానికి సీమాంధ్రుల వద్ద ఏ స్టేట్‌మెంటూ లేదన్నారు.

డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ సమ్మారావు మాట్లాడుతూ చంద్రబాబు సన్నాయి నొక్కులు ఆపాలని హితవు పలికారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బక్క జడ్సన్, ఆత్మకూరు మార్కె కమిటీ చైర్మన్ పింగిలి వెంకటనర్సింహారెడ్డి,చిదిరాల సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, పైడి, సర్పంచ్ సామెల్, రాము, గౌతమ్, సారంగపాణి, సంపత్, శ్రీనివాస్, సతీష్‌కుమార్, అశోక్, జనార్దన్‌రెడ్డి, జయపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 ఎవరు అడ్డుపడ్డా తెలంగాణ ఆగదు
 వరంగల్ సిటీ : ఎవరు అడ్డుపడ్డా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ఆగదు.. ఇటు సూర్యుడు అటు పొడిచినా సోనియా వెనుకంజ వేయరని మంత్రి బస్వరాజు సారయ్య ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండలోని సర్క్యుట్ గెస్ట్‌హౌస్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతవాసులకు ఎవైనా సమస్యలుంటే అనుభవజ్ఞుడైన దిగ్విజయ్‌సింగ్‌కు చెప్పుకోవచ్చన్నారు. మీకేం కావాలో? మీ బాధలేంటో వివరించాలని కోరారు. సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. దీనిని సీఎం, పీసీసీ అధ్యక్షుడితో సహా అందరూ ఖండించాల్సిందేనన్నారు. అసాంఘిక శక్తులను అరికట్టాలని కోరారు. దేవుని దర్శనం కోసం వెళ్లిన వారిపై దాడులు చేయడం సిగ్గుచేట న్నారు. సమావేశంలో పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాంబారి సమ్మారావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement