అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలి

Rastha Roko On Diarrhea Deaths - Sakshi

తాగునీటి సమస్యపై స్థానికుల రాస్తారోకో

బాధిత కుటుంబాలకు రూ.20 లక్షలు

ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌

గుంటూరు ఈస్ట్‌: గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పొన్నూరు రోడ్డు, బారాఇమాంపంజా సెంటర్‌లో వారం రోజులుగా నీటి సమస్య, డయేరియాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ఈ నిరసనకు వైఎస్సార్‌ సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యకు కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.  ఈస్ట్‌ డీఎస్పీ కండె శ్రీనివాసులు, పాతగుంటూరు ఎస్‌హెచ్‌వో బాలమురళీకృష్ణలు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమింపచేసేందుకు ప్రయత్నించారు.

నిరసనకారులు ర్యాలీగా పాత గుంటూరు పోలీసు స్టేషన్‌కు చేరుకుని అక్కడ రోడ్డుపై బైఠాయించారు. సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నినదించారు. ఈసందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు షేక్‌ చాంద్‌బాషా, షేక్‌ సమీవుల్లా, కాంగ్రెస్‌ నాయకులు షేక్‌ బాజీ, స్థానిక నాయకులు మహమ్మద్‌ షరీఫ్, ఫిరోజ్, హమీద్‌ మాట్లాడుతూ శనివారం కార్పొరేషన్‌ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.  ముస్లిం మైనార్టీలు ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితోనే వేలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారని, కొంత మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించి అభివృద్ధి మరించిందని ఆరోపించారు. ఈప్రాంతాల్లో నిరుపేదలు ఎక్కువగా నివాసం ఉంటున్నారని, అనారోగ్యబారిన పడి ఆసుపత్రుల్లో వేలాది రూపాయలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం మృతిచెందిన కుటుంబాలకు రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించి పూర్తి స్థాయిలో ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top