శ్రీకాకుళంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు
తప్పు కప్పిపుచ్చుకునేందుకు బాబు సర్కారు ఆపసోపాలు
కలుషిత నీరే కాలకూట విషమై నలుగురు బలైనా కానరాని పశ్చాత్తాపం
మరణాలను తగ్గించి చూపేందుకు తీవ్ర యత్నం
అతిసారం వల్ల ఒక్కరే మరణించినట్టు ప్రకటన
శ్రీకాకుళంలో అదుపులోకి రాని డయేరియా
162కు చేరిన బాధితుల సంఖ్య.. మరో ఆరుగురి పరిస్థితి విషమం!
అర్ధరాత్రి టీడీపీ నేతల హడావుడి
కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్పై నెపం నెట్టేసి సస్పెన్షన్ వేటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : శ్రీకాకుళంలో కలుషిత నీరే కాలకూట విషమై అతిసారం ప్రబలి నలుగురు మరణించినా చంద్రబాబు సర్కారులో పశ్చాత్తాపం కానరావడం లేదు. తక్షణం స్పందించి వ్యాధి వ్యాప్తిని అరికట్టి బాధితులకు సాంత్వన కల్పించాల్సిన సర్కారు ఆ పని చేయకుండా జరిగిన ఘటనలో తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు శతవిధాలా యత్నిస్తోంది. తీవ్రతను ఎలాగైనా నీరుగార్చి ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవాలని కుట్రలు చేస్తోంది. దీనిలోభాగంగానే మరణాలను నిర్ధారించే విషయంలో అధికారులు దోబూచులాడారు. కేవలం ఒక్కరే మరణించినట్టు ప్రకటించారు.
మిగతా వారి మరణాలపై విశ్లేషించాల్సి ఉందని చెబుతున్నారు. దీనిపై మృతుల కుటుంబీకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి కుటుంబ సభ్యులు బలై పుట్టెడు దుఃఖంలో ఉన్న తమను ఓదార్చి, అండగా ఉండాల్సింది పోయి ప్రభుత్వం కుంటిసాకులు వెతుక్కోవడంపై మండిపడుతున్నారు.
అధికారం చేపట్టినప్పటి నుంచి రక్షిత మంచినీటి సరఫరాపై తీవ్ర అలసత్వం ప్రదర్శించిన సర్కారు ఇప్పుడు ఈ ఘటనకు 14 రోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన కార్పొరేషన్ కమిషనర్ను బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్ వేటు వేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
పెరుగుతున్న కేసులు
మరోవైపు అతిసారాన్ని అదుపు చేసేందుకు సర్కారు సరైన చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా డయేరియా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం మంగళవారం నాటికి 68 కేసులు నమోదైతే బుధవారానికి 102కి చేరుకున్నాయి.
అనధికారిక లెక్కల ప్రకారం 162 మందికిపైగా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. చాలా మంది వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మరికొందరు ఇళ్లల్లో ఉండే మందులు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఆ బాధితుల లెక్క పరిగణనలోకి రాలేదని అధికారులు చెబుతున్నారు.
కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్న డయేరియా
శ్రీకాకుళంలో మిగతా ప్రాంతాలకూ డయేరియా విస్తరిస్తోంది. మంగళవారం నాటికే సగం నగరం అతిసారం బారిన పడింది. బుధవారం కొత్త ప్రాంతాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని 10 నెట్వర్క్ ఆస్పత్రులు ప్రస్తుతం డయేరియా రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13 మంది మాత్రమే డిశ్చార్జి అయ్యారు.
అసలైన బాధ్యులను వదిలి.. కమిషనర్ బలి
కలుషిత నీటి సరఫరాకు కారణమైన ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను వదిలేసిన ప్రభుత్వం.. 14 రోజుల కిందట కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన హనుమంతు కూర్మారావును బలి పశువును చేస్తూ నిర్ణయం తీసుకుంది. నగరంపైన, కార్పొరేషన్ పాలనపైన అవగాహన చేసుకునే లోపే డయేరియా ప్రబలడానికి బాధ్యుడిని చేస్తూ నెపం ఆయనపైకి నెట్టేసి సస్పెన్షన్ వేటు వేసింది.
కాలవకూట విషమే కారణం !
డయేరియా ప్రబలడానికి కారణాలను చంద్రబాబు ప్రభుత్వం బయటకు చెప్పలేకపోతోంది. శాంపిల్స్ పంపించాం, ఫలితాలు ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అని చెప్పడమే గానీ నాలుగు రోజులవుతున్నా అసలు కారణం వెల్లడించలేదు. వాస్తవానికి మురుగు కాలవల్లోని నీరు పైప్లైన్ ద్వారా తాగునీటితో కలుషితం కావడం వల్లే ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకున్నాయని అధికారులకు, పాలకులకు తెలుసు.
కానీ నీరు కలుషితమైందని చెబితే ప్రభుత్వ వైఫల్యం బట్టబయలవుతుందని, కార్పొరేషన్ మంచినీళ్లు తాగి ప్రజలు చనిపోయారనే సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళ్తాయని వాస్తవాలను దాచేసేందుకు సర్కారు కుట్ర చేస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం వరకు క్షేత్రస్థాయిలో కనిపించని టీడీపీ నాయకులు ఆ తర్వాత హడావుడి చేయడం మొదలు పెట్టారు. ఎమ్మెల్యేతో సహా పలువురు నాయకులు ఆస్పత్రులు, వ్యాధి ప్రబలిన ప్రాంతాల బాట పట్టారు. అధికారులతో సమీక్షలంటూ అర్ధరాత్రి హడావుడి చేశారు.


