సామాజిక, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా వెనుకబడిన తూర్పుకాపులను బీసీ-ఏలో చేర్చాలని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్,
విజయనగరం మున్సిపాలిటీ: సామాజిక, ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉద్యోగాల పరంగా వెనుకబడిన తూర్పుకాపులను బీసీ-ఏలో చేర్చాలని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్, తూర్పుకాపు సామాజిక వర్గ నాయకుడు బెల్లాన.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉన్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్రోడ్డులో గల ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుకాపులను బీసీ-ఏలో చేర్చేందుకు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, విద్యార్ధులు, యువతతో పోరాటం చేస్తామన్నారు.
అంబళ్ల శ్రీరాములునాయుడు మాట్లాడుతూ విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో 95 శాతం మంది తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉండగా.. అందరూ రైతులు, రైతు కూలీలు, కార్మికులుగానే జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించుకునే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ ఉపాధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ మాట్లాడుతూ తూర్పుకాపులను బీసీ-ఏలో చేర్చే వరకూ రాజీలేనిపోరాటం చేస్తామని చెప్పారు. సమావేశంలో గెదల సన్యాసినాయుడు, నడిపేన శ్రీనివాసరావు, సంగంరెడ్డి బంగారునాయుడు, బోడసింగి ఈశ్వరరావు, వలిరెడ్డి శ్రీనివాసరావు, బోడసింగి నారాయణరావు, సత్తరపు శంకరరావు, థాట్రాజు కృష్ణ, ముల్లు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.