
88% వినియోగదారులపై భారం!
ఎన్నికల సంవత్సరం అని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం భారీగా విద్యుత్ షాకులిచ్చేందుకు సర్కారు సిద్ధమయింది.
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంవత్సరం అని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం భారీగా విద్యుత్ షాకులిచ్చేందుకు సర్కారు సిద్ధమయింది. అన్నదాతలపై కూడా జాలి చూపకుండా చార్జీలు పెంచుతోంది. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోదారులు 2.53 కోట్ల మంది కాగా.. ఇందులో సుమారు రెండు కోట్ల మంది గృహ వినియోగదారులే ఉన్నారు. మొత్తం 88.17% వినియోగదారులపై భారం పడనుంది.
మిగతావి ఉచిత విద్యుత్ కనెక్షన్లు. మీటర్లు ఉన్న రైతులకు యూనిట్కు ఒక పైసా పెంపు మాత్రమే ప్రతిపాదించినా ప్రతి రైతుకూ ఏటా రూ.825 అదనపు భారం పడనుంది. ఐదు అశ్విక శక్తి (హార్స్ పవర్)గల మోటార్లతో ప్రతిరోజు ఏడు గంటలు విద్యుత్ వినియోగిస్తే 226 యూనిట్లు ఖర్చవుతుంది. ఒక్కపైసా చొప్పున రోజుకు రూ.2.26.. 365 రోజులకు రూ.825 మేరకు అదనపు భారం పడుతుందన్నమాట.
కోతలు మాత్రం తప్పవు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీలను ఏటా భారీగా పెంచుతున్న ప్రభుత్వం... కోతలను ఎత్తివేసేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనూ విద్యుత్ కోతలు కొనసాగుతాయని డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం 99,046 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ డిమాండ్ ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. ఇందులో కేవలం 85,582 ఎంయూల మేరకు మాత్రమే సరఫరా చేయగలమని, 13,464 ఎంయూల లోటు ఉంటుందని తెలిపాయి. రీ-లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు (ఆర్-ఎల్ఎన్జీ) ద్వారా విద్యుత్ను ఉత్పత్తి చేసి లోటు తీర్చుతామని డిస్కంలు పేర్కొంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
రాష్ట్రంలోని గ్యాసు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు ఆర్-ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు గ్యాస్ పైపులైను లేదు. గ్యాస్ స్వాపింగ్ ద్వారా కేజీ బేసిన్ గ్యాసును మనం తీసుకుని... మనం కొనుగోలు చేసిన ఆర్-ఎల్ఎన్జీని గుజరాత్లోని విద్యుత్ ప్లాంట్లు, ఉత్తరప్రదేశ్లోని ఎల్ఎన్జీ ప్లాంట్లకు ఇచ్చే అవకాశమూ లేదు. ఎందుకంటే ఈ ప్లాంట్లకు కేజీ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆర్-ఎల్ఎన్జీతో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేదు. అంటే 13,464 ఎంయూల మేరకు కోతలు తప్పవన్నమాట.
ఐదేళ్లలో రూ. 33,538 కోట్ల భారం!
మరో ఐదేళ్లూ చార్జీలు పెంచబోమని అప్పట్లో వైఎస్ హామీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా విద్యుత్ చార్జీలను పెంచుతోంది. 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి మొదలుకుని 2013-14 వరకు వరుసగా నాలుగేళ్లు చార్జీలను పెంచిన ప్రభుత్వం... ఐదో ఏడాది (2014-15)లోనూ చార్జీల పెంపునకు సిద్ధపడింది. ఇప్పటివరకు విద్యుత్ చార్జీలు, సర్దుబాటు చార్జీల రూపంలో ప్రభుత్వం రూ.24,218 కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది.
తాజా ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోదిస్తే మొత్తం చార్జీల భారం ఏకంగా రూ.33,538 కోట్లకు చేరుకోనుంది. ‘గత ఐదేళ్లలో విద్యుత్ చార్జీలను పెంచలేదు... వచ్చే ఐదేళ్లూ పెంచేది లేదు..’ అన్న వైఎస్ హామీకి నిలువునా తూట్లు పొడుస్తూ ప్రభుత్వం ఐదేళ్లూ చార్జీలను పెంచడం గమనార్హం. మరోవైపు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తామన్న వైఎస్ ఎన్నికల హామీకి కూడా సర్కారు నీళ్లొదిలింది.
రైల్వేపై రూ.90 కోట్ల భారం!
సాక్షి, హైదరాబాద్: రైల్వే వాడుకుంటున్న కరెంటుకు యూనిట్కు 50 పైసలు చొప్పున చార్జీలు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. దీంతో రైల్వేపై ఏటా రూ.90 కోట్ల వరకు భారం పడుతుంది. గత మార్చిలో పెంచిన చార్జీల వల్ల రూ.165 కోట్ల భారం పడటంతో, అసలే నష్టాల్లో ఉన్న రైల్వేకు ఇది మరో శరాఘాతం. రైల్వే ట్రాక్షన్ (రైలుకు వాడే కరెంటు) కోసం వాడే కరెం టు యూనిట్ ధరను గత మార్చిలో రూ.6.36కు పెంచారు. తాజాగా దాన్ని రూ.6.86కు పెంచాలని ప్రతిపాదించారు. స్టేషన్లు, రైల్వే కాలనీలకు వాడే కరెంటు చార్జీలను కూడా యూనిట్కు 50 పైసలు చొప్పున పెంచాలని ప్రతిపాదించారు.
పరిశ్రమలపై ఇక ‘హార్మోనిక్’ చార్జ్..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే విద్యుత్ కోతలు, చార్జీలతో పరిశ్రమలపై పెనుభారం మోపిన ప్రభుత్వం... హార్మోనిక్ సర్చార్జీ పేరుతో మరింత మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. నిర్ణీత లోడు మేరకు విద్యుత్ను వినియోగించకుండా.. అకస్మాత్తుగా హెచ్చుతగ్గులతో విద్యుత్ను వినియోగించే పరిశ్రమల నుంచి భారీగా సర్చార్జీ వసూలు చేసేందుకు ప్రణాళిక వేసింది. ‘హార్మోనిక్ సర్చార్జీ’ పేరిట ఇటువంటి పరిశ్రమల నుంచి నెలకు చెల్లించే మొత్తం విద్యుత్ చార్జీలో 25 శాతం అదనంగా రాబట్టాలని నిర్ణయించింది. దేశంలో తమిళనాడు తర్వాత మన రాష్ట్రంలోనే ఇది అమలు కానుండటం విశేషం.
మరమగ్గాలకు సబ్సిడీ విడుదల
సాక్షి, హైదరాబాద్: మరమగ్గాలకు వాడుతున్న విద్యుత్కు 50 శాతం రాయితీ కింద ప్రభుత్వం రూ. 25.27 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలైన సబ్సిడీ 2010 ఏప్రిల్ నుంచి 2012 ఏప్రిల్ కాలానికి సంబంధించినదిగా పేర్కొంది. సర్దుబాటు చార్జీలు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది.