పవర్ పోలిస్ | Power of Police | Sakshi
Sakshi News home page

పవర్ పోలిస్

Mar 17 2014 1:01 AM | Updated on Aug 21 2018 8:41 PM

ఎన్నికల వేళ.. పైగా రాష్ట్రపతి పాలన.. అధికారులే సుప్రీంలు.. రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేయడానికి పోలీసు శాఖ అప్రమత్తమవుతోంది.

 ఎన్నికల వేళ.. పైగా రాష్ట్రపతి పాలన.. అధికారులే సుప్రీంలు.. రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేయడానికి పోలీసు శాఖ అప్రమత్తమవుతోంది. ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. చట్టం పదును పెరగడంతో పోలీస్‌లకు మరింతగా ‘పవర్స్’ వచ్చాయి. దీంతో చట్టం ఎవరికీ చుట్టంగా మారే అవకాశాలు లేవు.

రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఎంతమాత్రమూ పనిచేయవు. నలుగురు గుమిగూడి అల్లరి చేస్తుంటే అక్కడికి చేరి యువకులు, పార్టీ కార్యకర్తలు న్యాయం చెబుతామనో.. జరుగుతున్న సన్నివేశాన్ని చూద్దామనుకోవడమూ ఇబ్బందుల్ని సృష్టించుకోవడమే అవుతుంది. కనీస జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు తప్పవు. ఎక్కడైనా గొడవ.. వివాదం జరుగుతోంది.. పోలీసుల రాకను గమనించి అసలు నిందితులు పారిపోతే అక్కడ చూసే వారిని ముందుగా విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
 

అభ్యర్థుల నుంచి హామీ పత్రాలు
 

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు గొడవలు, వివాదాలు సృష్టించే ప్రమాదం ఉన్న నాయకులను పోలీసులు ముందస్తుగా బైండోవర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు తహశీల్దార్ సమక్షంలో వారి నుంచి ఒక హామీ పత్రాన్ని తీసుకుంటారు. ఆస్తి, కాకుంటే నగదు హామీగా చూపుతూ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే అలాంటి వ్యక్తులపై తిరిగి కేసులు నమోదు చేస్తారు. హామీగా ఇచ్చిన ఆస్తి, నగదును జప్తు చేసి ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. గడిచిన పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల నుంచి హామీ పత్రాలను తీసుకునే ప్రక్రియను తొలిసారిగా ప్రారంభించారు. దీంతో ఎన్నికల ప్రశాంతంగా జరిగాయి. ప్రస్తుతం కూడా బైండోవర్ అయిన నాయకులు, కార్యకర్తల నుంచి హామీ పత్రాలను తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
 
 
 
 ఈ  నేరాల్లో  రౌడీషీట్..
 
  క్రిమినల్ ప్రోసిజర్ కోడ్(సీఆర్‌పీసీ) చట్టంలోని 106, 107, 108, 110(ఈ), (జీ) సెక్షన్ల కింద రెండు అంత కంటే ఎక్కువ పర్యాయాలు తహశీల్దార్ ఎదుట బైండోవర్ అయిన వ్యక్తులపై రౌడీషీట్ ప్రారంభించవచ్చు.
   గుంపుగా వెళ్లి మరో గుంపుపై గొడవకు దిగడం, సమాజాన్ని ప్రశాంతంగా లేకుండా సమస్యలు సృష్టించడం వంటి నేరాల్లో తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తుంటారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు బైండోవర్ అయిన వ్యక్తిపై షీట్ ప్రారంభించవచ్చు.
  ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, వారి దైనందిన కార్యక్రమాలకు ఇబ్బందులు సృష్టించడం వంటివి చేస్తుంటారు. ఇలా చేసే ఏ వ్యక్తిపైనైనా పోలీసులు ఏపీ పట్టణ న్యూసెన్స్ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. సాధారణంగా వీటిని చాలా చిన్న కేసులుగా భావిస్తుంటారు. వరుసగా రెండేళ్లలో రెండు, అంతకంటే ఎక్కువ సందర్భాల్లో ఈ చట్టం కింద కేసు నమోదయితే వారిపై రౌడీషీట్ తెరిచే అవకాశం ఉంది.

  ఎవరైనా వ్యక్తి, సమూహం అయినా కుల, మత రాజకీయ ఘర్షణలకు పాల్పడితే వారిపై కూడా రౌడీషీట్ తెరిచే అవకాాశం ఉంది.
  మద్యం తాగి అల్లర్లు చేయడం, మద్యం తదితర మత్తు పదార్థాల రవాణా, దౌర్జన్యాలు, వ్యాపార కేంద్రాలు, దుకాణాల వద్ద మామూళ్లు వసూలు చేయడం వంటి నేరాలకు పాల్పడిన వారిపై కూడా రౌడీషీట్ తెరుస్తారు.
 

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నారని పోలీసులు భావించినా ఇదే పరిస్థితి. పోలింగ్ రోజున కేంద్రాల వద్ద రిగ్గింగ్‌కు పాల్పడినా, పోలింగ్ పెట్టెలను ఎత్తుకెళ్లినా, ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసినా అంతే సంగతులు. పోలింగ్ అధికారులపై దౌర్జన్యానికి దిగినా ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించినా వారి మెడకు రౌడీషీట్ చుట్టుకున్నట్లే.
 
 
 గ్రామాల వారీగా సమాచారం సిద్ధం

 

గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన నాయకులు, వ్యక్తుల జాబితా పోలీసుల వద్ద సిద్ధంగా ఉంది. వీరందరినీ మునిసిపల్, జెడ్పీ, సాధారణ ఎన్నికల సందర్భంగా మరోసారి బైండోవర్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా వేశారు. ఆయా గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులను అంచనా వేయడంతోపాటు సమస్యలు సృష్టించిన వ్యక్తులపైనా దృష్టి సారించారు. తమ స్టేషన్ల పరిధిలోని సమస్త సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఎక్కడ, ఎవరు తోక జాడించినా కత్తెర వేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు.
 
 స్టేషన్ల చుట్టూ తిరగాల్సిందే..

 ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపై రౌడీషీట్ ప్రారంభించే అవకాశాలూ ఉన్నాయి. ఒకసారి రౌడీషీట్ తెరిస్తే పోలీసు స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. అంతే కాదు ఎపుడు, ఏ తరహా ఎన్నికలు వచ్చినా.. విద్వేషాలు చెలరేగినా.. గొడవలు జరిగే ప్రమాదమున్నా ప్రతి సంఘటనకు ముందే రౌడీషీటర్లను స్టేషన్‌కు పిలిపిస్తారు. తమదైన శైలిలో కాసింత గట్టిగానే కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే స్థానిక తహశీల్దార్ ఎదుటా బైండోవర్ చేస్తారు. అంతేకాదు గొడవలు సద్దుమణిగేదాకా స్టేషన్‌లో ఉంచుకొనే అవకాశం ఉంది.  ఒక్కసారి రౌడీషీట్ తెరిస్తే దాన్ని తిరిగి మాఫీ చేసుకోవడం అంత సులభం కాదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement