ఐదు ప్రశ్నలడుగుతా.. ఆన్సరివ్వు

Political Satire On Leaders Promises - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: గతం.. గతం.. రజనీకాంత్‌ స్టైల్‌గా బీడీ తాగుతూ బాబా ఫోజులో చెబుతున్నాడు టీవీలో. ఈ డైలాగు నాయకుడు సర్వేశ్వరరావుకు తెగ నచ్చేసింది. గత ఎన్నికల హామీల గురించి అడిగినప్పుడు ఈ పద్ధతి ఫాలో అయిపోతే బెటరని ఫిక్సయిపోయాడు. ప్రచారం మొదలైంది. వెనుక పాటలు.. ముందు మాటలు.. మధ్యలో ఆటలు.. ఇలా కోలాహలంగా ఎన్నికల ప్రచా రం సాగుతోంది. రథంపై నుంచి సర్వేశు దుమ్ము రేగుతున్నా పట్టించుకోకుండా నవ్వుతూనే ఉన్నాడు. జనం ఎవరికీ ప్రశ్నించే అవకాశం ఇవ్వకూడదని, శాపనార్థాల్లాంటివి ఇప్పు డు వినిపిస్తే బాగోదని ముందు జాగ్రత్తగా పాటల సౌండ్‌ పెంచాలని అప్పటికే ఆదేశాలిచ్చి ఉన్నాడు. ప్రచారం వీధులన్నీ దాటి కూడలికి చేరింది. ఇది ప్రసంగ సమయం.. సర్వేశు రెడీ అయిపోయాడు.. పొద్దున్నే బట్టీ పట్టిన ప్రసంగ పాఠమంతా గుర్తు చేసుకుని మైకందుకున్నాడు.

‘సోదర సోదరీమణులారా..’ అంటూ మొదలుపెట్టేసరికి.. అటు వైపు నుంచి కూడా ‘ప్రియమైన నాయకుడా..’ అని సౌండ్‌ వినిపించింది. ఒక్క మైకు మాత్రమే తీసుకురావాలని, అది తాను మాత్రమే వాడాలని సర్వేశు చాలా గట్టిగా చెప్పాడు.. మరీ ఈ రెండో మైకు ఎవరిది..? అని అనుమానం వచ్చి చుట్టుపక్కల చూశాడు. జనం మధ్యలో సీతారామారావు చేతి లో ఉన్న మైక్‌ చూసి ఆశ్చర్యపోయి  ఇదేమిటిది  అని అమాయకంగా అడిగాడు సర్వేశు.
‘హామీలిస్తారు.. అమలు చేయరు. మాటలు చెబుతారు.. మర్చిపోతారు. ఇలా ప్రచారం చేస్తారు.. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. అందుకే నా మైక్‌ నేనే తెచ్చుకున్నా..’ అని సీతారామారావు ఏ మాత్రం బెరుకు లేకుండా చెప్పేసరికి సర్వేశు గొంతు తడారిపోయింది.
గత ఎన్నికల్లో 30 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు కదా.. ఎన్ని పనులు చేశారు.. మొదటి ప్రశ్న వేశాడు సీతారామారావు.
గతం గతం.. ఇప్పుడెందుకు అవి.. ఆ పుస్తకం కూడా ఇప్పుడు దొరకడం లే దు అని సర్వేశు లోగొంతుతో అన్నాడు..
‘మీరిలా అంటారనే ఓ కాపీ నా దగ్గరే పెట్టుకున్నా..’ అని సీతారామారావు తాను తెచ్చిన కాపీని జనానికి చూపించాడు..
‘మా ఊరికి కాంప్లెక్స్‌ కట్టిస్తానని.. ముప్పై ఏళ్లుగా చెబుతున్నారు.. కట్టడానికి ఏమైంది..’ రెండో ప్రశ్న..
‘కట్టేస్తే వచ్చే ఎన్నికల్లో చెప్పడానికి ఏమీ ఉండదు కదా.. అందుకే కట్టలేదు.. గతం గతం..’ అని సర్వేశు వీరాభిమాని ఒకడు ఆవేశంగా సర్వేశు చేతిలో మైకు లాగేసుకుని చెప్పేశాడు..
అనుచరుడి స్వామిభక్తి చూసి నవ్వాలో, ఏడవాలో తెలీక సర్వేశు కోపంతో ఓ చూపు చూసి జనానికి ఏ ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వాలో అర్థంకాక తల వంచేశాడు..
‘సరే.. ఇన్నేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా.. మన ఊరి గురించి అసెంబ్లీలో ఎప్పుడైనా ప్రస్తావించారా..?’ సీతారామారావు సూటిగా, ఇంకాస్త గట్టిగా మూడో ప్రశ్న అడిగాడు..
‘గతం.. గతం.. ఇప్పుడు ఓటెయ్యండి ప్రతి రోజూ మన ఊరి పేరే అసెంబ్లీలో జపం చేస్తా..’ హమ్మయ్య ఒక్కదానిౖకైనా సమాధానం చెప్పా అని తృప్తిగా తలెత్తాడు సర్వేశు..
‘ఇప్పుడా చాన్స్‌ లేదు గానీ.. మీ వెనుక ఉన్నవారికి తప్ప ఊరిలో వారికెవరికైనా మంచి చేశారా..?’ నాలుగోది స్పష్టంగా అడిగాడు సీతారామారావు..
‘ఎందుకు చెయ్యాలి అందరికీ.. అందరూ ఓట్లేస్తారా.. ఎవరు ఓట్లేస్తే వారికే చెయ్యాలి గానీ..’ అని అదే అభిమాని ఆవేశం ఆపుకోలేక సర్వేశు చేతి నుంచి మళ్లీ మైకు లాగేసుకున్నాడు..
‘అలా చేస్తే ఎమ్మెల్యే వెనక తిరిగే వారికి మాత్రమే టాక్స్‌ కట్టమనండి.. మాపై పన్నులు రుద్దకండి.. జనం డబ్బు అందరికీ ఖర్చు చేయాలి.. జనమంతా పన్నులు కడుతుంటే.. కొందరికే ఖర్చు చేయడం ఏమిటి... జనం డబ్బును  అనుచరులకు దోచి పెట్టడానికి మీరెవరు..?’ అని సీతారామారావు అడిగే సరికి సర్వేశుకు సమాధానం దొరకలేదు..
‘సరే.. దేశమంతా రోడ్లు వేస్తే ఇక్కడా వేశారు. దేశమంతా కాలువలు తవ్వితే ఇక్కడా తవ్వారు. అవి కాకుండా ఇన్నేళ్లుగా మిమ్మల్ని గెలిపిస్తున్న జనం కోసం మీరు మాత్రమే ప్రత్యేకించి చేసిన పనేమైనా ఉందా?’ ఐదో ప్రశ్నలను ఘాటుగా అడిగాడు సీతారామారావు..
ప్రత్యేకం అంటేనే.. సర్వేశ్వరరావుకు మాటలు ఆగిపోతాయి. ఈ సారి అభిమాని కూడా ఏమీ చెప్పలేకపోయాడు. మౌనమే సమాధానంగా అంతా స్టేజిపై నిలుచుండిపోయారు.
‘నీకు ఐదు ప్రశ్నలే ఎక్కువ.. ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిననాడే జనం ముందుకు రా..’ అంటూ సీతా రామారావు మైకు ఆపేసి వెళ్లిపోయాడు..
అప్పటికి ఊపిరి పీల్చుకున్న సర్వేశు ఐదు కాదు ఐదు వందల సమస్యలకు సమాధానాలిస్తా.. నాకు ఓటెయ్యండి అంటూ సీతారామారావు లేడనే ధైర్యంతో గట్టిగా అనేశాడు. గతం గతం.. మార్పునకు స్వాగతం అంటూ ఓ కొత్త ఓటరు గట్టిగా అనేసరికి జనానికి విషయం అర్థమై సభకు నమస్కారం పెట్టేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top