రైళ్లలో గంజాయి రవాణా నిరోధిస్తాం | Plan to transport marijuana via train | Sakshi
Sakshi News home page

రైళ్లలో గంజాయి రవాణా నిరోధిస్తాం

Jan 1 2014 12:30 AM | Updated on Mar 28 2018 10:59 AM

రైళ్లలో గంజాయి రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్‌ఎం) రమణారెడ్డి స్పష్టం చేశారు.

 తాండూరు, న్యూస్‌లైన్: రైళ్లలో గంజాయి రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్‌ఎం) రమణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి 11గంటలకు గూడ్సు రైలు ఇంజిన్‌లో తాండూరుకు చేరుకున్న ఏడీఆర్‌ఎం స్థానిక హోం సిగ్నల్ వద్ద దిగారు. అక్కడి నుంచి రాత్రి తాండూరు రైల్వేస్టేషన్‌కు వచ్చారు. రాత్రి అతిథి గృహంలో బస చేసిన ఆయన తెల్లవారుజాము నుంచి ఉదయం 10.30గంటల వరకు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ఎం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో రవాణా అవు తూ తాండూరు రైల్వేస్టేషన్‌లో పట్టుబడ్డ గంజాయి వ్యవహారంపై సమగ్రంగా విచారణ జరిపిస్తామన్నారు.
 
 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్)ను బలోపేతం చేస్తామని, రైళ్లలో ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు. రైళ్లలో గంజాయి రవాణా చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న తాండూరు - సికింద్రాబాద్ పుష్‌పుల్ రైలును ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఏడీఆర్‌ఎం చెప్పారు. ప్యాసిం జర్ రైలుకు అవసరమైన 12 బోగీలను సమకూర్చే ప్రక్రియ జరుగుతోందన్నారు. గుంటూరు - వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను తాండూరు వరకు పొడిగించేం దుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తాండూరు రైల్వేస్టేషన్‌లో క్యాం టీన్ ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చాయని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. రెండో ప్లాట్‌ఫాంపై టికెట్ కౌంటర్ ఏర్పాటుకు యోచిస్తామన్నారు. ఆదర్శ రైల్వేస్టేషన్‌గా ఎంపికైన తాండూరులో చేయాల్సిన అభివృద్ధి చేసినట్టు ఆయన స్పష్టం చేశారు. రైల్వేస్టేషన్ ఆవరణలో ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల పా ర్కింగ్‌పై ఆంక్షలు విధించామన్నారు. పా ర్కింగ్ స్థలాన్ని విస్తరించాలని కాంట్రాక్టర్ చేసిన విన్నపానికి ఏడీఆర్‌ఎం సానుకూలంగా స్పందించారు. ఆయన వెంట సికిం ద్రాబాద్ డివిజనల్ ఏడీఎం యాదగిరి, ఏసీఎం చంద్రబాబు, సీఐ వెంకటేశం పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
 
 ఏడీఆర్‌ఎం తనిఖీలు...
 అంతకుముందు ఏడీఆర్‌ఎం రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికుల విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, టికెట్ కౌంటర్, కంప్యూటర్ విభాగం, విచారణ గది, సిగ్నల్ వ్యవస్థ, తాగునీటి నల్లాలు, సిబ్బంది క్వార్టర్స్, వాహనాల పార్కింగ్ స్థలాన్ని తనిఖీ చేశారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే స్టేషన్‌లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్లాట్‌ఫాంలతో పాటు స్టేషన్ ఆవరణలో అడ్డగోలుగా చెత్త డంపింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్ ఆవరణలో ఒక చెత్తకుండీని ఏర్పాటు చేయాలని తాండూరు ఏడీఎన్‌ను ఆయన ఆదేశించారు. తాగునీటి నల్లాల వద్ద గుట్కాలు ఉమ్మి వేయకుండా, భోజనం ప్లేట్లు శుభ్రం చేయకుండా చూడాలన్నారు. తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాలని ఆదేశించారు. ఫ్లాట్‌ఫాంలపై ఉమ్మినా, చెత్త వేసినా జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. రైళ్లు వచ్చే సమయంలో స్టేషన్‌లో విశ్రాంతి గదులను తెరిచి ఉంచాలని సూచించారు. స్టేషన్‌లో రైళ్లు ఆగినప్పుడు, బోగీలు, ఇంజిన్లు వేరుచేసే సమయంలో పకడ్బందీగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement