ప్రజా సంకల్ప యాత్రకు.. మేము సైతం! | people support to ys jaganmohan reddy praja sankalpa yatra | Sakshi
Sakshi News home page

ప్రజా సంకల్ప యాత్రకు.. మేము సైతం!

Nov 3 2017 11:24 AM | Updated on Jul 6 2018 2:51 PM

people support to ys jaganmohan reddy praja sankalpa yatra - Sakshi

పాదయాత్రలో పాల్గొన్న కృష్ణదాస్, రెడ్డి శాంతి, పద్మప్రియ

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: దుష్టపాలనకు చరమగీతం పాడాలి... సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ స్థాపించుకోవాలి! వంచన నాయకులకు బుద్ధి చెప్పాలి... ప్రజల నాయకుడు జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలి! నీటిమూటల్లాంటి హామీలతో మోసాలకు నూకలు చెల్లాయని చెప్పాలి... అన్ని వర్గాలకు అండగా నిజాయతీతో పనిచేసే జగన్‌ నాయకత్వం రాష్ట్రానికి కావాలి! చంద్రబాబు పాలనలో ప్రజలు పడుతున్న కష్టనష్టాలు తెలుసుకొనేందుకు జగన్‌ తలపెట్టిన ‘ప్రజాసంకల్పం’ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించాలి... గత దఫా చంద్రబాబు పాలనలో చీకటిని పారద్రోలేందుకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిర్వహించిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను స్ఫూర్తిని అణుఅణువునా నింపుకొని పనిచేయాలి! ఇలా ఒకటీ రెండు కాదు 30 కిలోమీటర్ల పొడవున వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ సలహామండలి సభ్యుడు, నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో సాగిన పాదయాత్రలో జయజయ ధ్వానాలు వినిపించాయి. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 6వ తేదీన ఇడుపులపాయలో ప్రారంభించనున్న ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర విజయవంతం కావాలని ఆశిస్తూ ప్రజలు సంఘీభావం ప్రకటించారు.

పుణ్యక్షేత్రం తిరుపతి మీదుగా ఇచ్ఛాపురం వరకూ 3 వేల కిలోమీటర్ల పొడవునా కోట్లాది ప్రజలతో మమేకమవుతూ రానున్న జననేతకు జయం కలగాలని శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో పూజలు నిర్వహించారు. జగన్‌ ‘ప్రజాసంకల్పం’ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ సంఘీభావంగా ఉదయం నరసన్నపేటలోని శ్రీఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి పాదయాత్ర మొదలైంది. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఈ యాత్రను ప్రారంభించారు. జలుమూరు, బుడితి తదితర గ్రామాల మీదుగా సాయంత్రానికి శ్రీముఖలింగం పుణ్యక్షేత్రానికి ఈ యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి కృష్ణదాస్‌ ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ, వారి కష్టాలు, కడగండ్లూ తెలుసుకుంటూ జగన్‌ పాదయాత్ర సాగుతుందని చెప్పారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలు, సర్వతోముఖాభివృద్ధి కోసమే ఈ మహాకార్యక్రమం తలపెట్టారని అన్నారు. రాష్ట్ర ప్రతిపక్షనేతగా ఇప్పటికే అనేక ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన తీరు హర్షణీయమన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించాలనే సంకల్పంతో, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మళ్లీ వైఎస్‌ సంక్షేమ కార్యక్రమాలను నిలబెట్టాలనే జగన్‌ తపిస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేందుకు ఉద్దేశించిన ప్రజాసంకల్ప యాత్రకు సంఘీభావంగా నరసన్నపేట నియోజకవర్గ శ్రేణులన్నీ తరలివచ్చాయన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో, ఎప్పుడు తమ కష్టాలు తొలగుతాయోనని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. అన్యాయ పాలన ఎప్పుడు తొలగుతుందోనని పూజలు చేస్తున్నారన్నారు. అనేక అబద్ధాలతో, మోసాలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కార్పొరేట్‌ సంస్థలకు మాత్రమే లబ్ధి చేకూర్చుతున్నారని విమర్శించారు. బీసీల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన ఇతర వర్గాలకూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇలా అన్ని వర్గాలకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేశారు.

రైతుల శ్రేయస్సు కోసం దీర్ఘకాలంగా పెండింగ్‌లోనున్న సాగునీటి ప్రాజెక్టులకు కార్యరూపం తీసుకొచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా అరాచక పాలన సాగిస్తోందని విమర్శించారు. ఈ పాలనను తుదముట్టించి వైఎస్‌ కుమారుడిగా జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఆనాటి సంక్షేమ పాలనను తీసుకొస్తారని ప్రజలు ఆశిస్తున్నారని చెప్పారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే తమకు మేలు జరుగుతుందని రైతులు ఒక్కరే కాదు మహిళలు, యువత, విద్యార్థులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాలవారూ కోరుకుంటున్నారని వెల్లడించారు. ఇంతమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జగన్‌ను ముఖ్యమంత్రి చేసేవరకూ పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. ప్రజాసంకల్పం పాదయాత్ర విజయవంతమవ్వాలని, ఆయన మనస్సులోని భావాలన్నీ కార్యరూపం దాల్చేలా ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.

నరసన్నపేట నుంచి శ్రీముఖలింగం వరకూ జరిగిన పాదయాత్రలో నరసన్నపేట పట్టణంతో పాటు నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల నుంచి భారీఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ సంఘీభావం ప్రకటించారు. పార్టీ నాయకులు ధర్మాన పద్మప్రియ, ధర్మాన రామదాస్, అంధవరపు సూరిబాబు, టి.కామేశ్వరి, శిమ్మ రాజశేఖర్, కొయ్యాన సుశీల, మెండ విజయశాంతి, కొయ్యాన సూర్యారావు, చిన్నాల వెంకట సత్యన్నారాయణ, బుక్కా లక్ష్మణరావు, తంగి మురళీకృష్ణ, వాన గోపి, కనుసు సీతారాము, కోన దామోదరావు, పైడి విఠలరావు, ధర్మాన రామలింగంనాయుడు పాల్గొన్నారు.

కృష్ణదాస్‌ దంపతుల ప్రత్యేక పూజలు
జలుమూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, అతని సతీమణి పద్మప్రియలు గురువారం శ్రీముఖలింగంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాత్ర సజావుగా జరిగేందుకు  శ్రీముఖలింగేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరారు. పేదల కష్టాలు తొలగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు జగన్‌మోహన్‌రెడ్డి గోత్ర నామాలతో ఏకవార అభిషేకాలు నిర్వహించి వారాహి అమ్మవారికి కుంకమ పూజలు చేయించారు.  దేవాలయ ఆవరణలోని దేవతా విగ్రహాలకు పూజలు చేశారు. కార్యక్రమంలో ధర్మాన రామదాస్, ఎంపీపీ కె.సుశీల, జెడ్పీటీసీ సభ్యురాలు మెండ విజయశాంతి, ధర్మాన రాగలింగంనాయడు, చిన్నాల వెంకట సత్యనారాయణ,శిమ్మ రాజశేఖర్, వైస్‌ ఎంపీపీ ప్రతినిధి టి.సతీష్, బుక్కా లక్ష్మణరావు, బసవ రత్నాలు, యోగీశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement