
అక్కడ మద్యం ముట్టరు!
మూడు దశాబ్దాల క్రితం కుటీర పరిశ్రమల సారా కాచిన అగళి మండలంలోని హెచ్డీ తండా వాసుల్లో పరివర్తన వచ్చింది.
గ్రామంలోని పలు కుటుంబాలు సారా మత్తులో జోగుతుండేవి. కొందరు ప్రాణాలు సైతం కోల్పోవడంతో గ్రామంలో సారా తయారీ అరికట్టాలని బాల్యానాయక్ నిర్ణయించుకున్నారు. ఈ విషయంపై స్థానిక యువతను తోడుగా తీసుకున్నారు. సారా తయారీ, తాగుడు వల్ల జరుగుతున్న అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. కొన్ని రోజుల్లోనే వారు ఆశించిన ఫలితం కనిపించసాగింది. నెమ్మదిగా ఒక్కొక్కరు సారా కాచే పని మానుకుని వ్యవసాయంపై దృష్టిసారించసాగారు. గ్రామ పరిధిలో రెండు వేల ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిని అర్హులకు పంపిణీ చేయించారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ వక్క, పూల తోటలతో లాభాలు గడించారు. ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో పక్కా గృహాలను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎటు చూసినా అభివృద్ధి కనడపడుతోంది. గ్రామంలో పిల్లలను బాగా చదివిస్తున్నారు. పలువురు ప్రభుత్వ ఉద్యోగులుగాను స్థిరపడ్డారు. పోలీసులు సైతం ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడకపోవడంతో అక్కడ ప్రశాంతత వెల్లివిరుస్తోంది.