గాంధీనగర్ ప్రజాసంఘాలు, కులసంఘాల పేరుతో సంఘంలో పరువు ప్రతిష్టలతో బతికే వారిని కొందరు బ్లాక్మెయిల్ ....
మాల మహాసభ
గాంధీనగర్ ప్రజాసంఘాలు, కులసంఘాల పేరుతో సంఘంలో పరువు ప్రతిష్టలతో బతికే వారిని కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మట్టా ఉష కేసులో మాదిగ హక్కుల సేన, యాదవసేన సమితి , జై ఆంధ్ర జేఏసీల అసత్య ప్రకటనలను ఖండిస్తున్నామన్నారు. క్రీస్తురాజుపురానికి చెందిన పాస్టర్ రత్నజ్యోతి తనయుడు డేవిడ్ రత్నజ్యోతిని కావాలనే మట్టా ఉష కేసులో కుల సంఘాల వారు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. డేవిడ్ రత్నజ్యోతికి 2012లోనే వివాహం అయిందన్నారు. కొందరు స్వార్థంతో డేవిడ్ రత్నజ్యోతికి మట్టా ఉషతో యనమలకుదురు చర్చిలో బలవంతంగా వివాహం జరిపించారన్నారు. చర్చికి వెళుతున్న తనను డేవిడ్ రత్నజ్యోతి తనను గర్భవతిని చేశారడని ఆరోపిస్తున్న ఉష.. ఏ హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చిందో చెప్పాలన్నారు. ఉష బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి నిజానిజాలను తేల్చి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
తన భర్తను వేధిస్తూ, తనపై దౌర్జన్యం చేశారని డేవిడ్ రత్నజ్యోతి భార్య హారిక జనవరి మూడో తేదీన మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు, ఆ ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా 27 రోజుల తర్వాత మట్టా ఉష ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి వేధించడం సరికాదన్నారు. సంఘంలో ఎంతో హుందాగా జీవిస్తున్న పాస్టర్ రత్నజ్యోతిని, అతని కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకే కొన్ని సంఘాల వారు తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి దోషులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాల మహాసభ నాయకులు బండి బాలయోగి, లింగతోటి సుధాకర్, జయప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.