పల్లె ఖజానాఖాళీ | panchayat officers failed in released funds to village | Sakshi
Sakshi News home page

పల్లె ఖజానాఖాళీ

Nov 29 2013 5:59 AM | Updated on Sep 2 2017 1:06 AM

పల్లెసీమల అభివృద్ధికి మూలమైన గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు.

ఇందూరు, న్యూస్‌లైన్:  పల్లెసీమల అభివృద్ధికి మూలమైన గ్రామ పంచాయతీలకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో పంచాయతీ అధికారులు విఫలమవుతున్నారు. పంచాయతీలలో సకాలంలో పన్నులను వసూలు చేయడంలో గ్రామ కార్యదర్శులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. జిల్లాలోని 718 గ్రామ పంచాయతీల ఆదాయాలను లెక్కించిన ప్రభుత్వం 2013-14 సంవత్సరానికి గాను రూ. 47.24 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆగస్టులోగా 60 శాతం పన్నుల వసూళ్లు పూర్తికావాల  ని సూచించింది.

అయితే, అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో లక్ష్యం నీరుగారిపోయింది, గ్రామ కార్యదర్శులు సైతం పన్నుల వసూలును తీవ్రంగా పరిగణించడం లేదు. దీంతో ఇప్పటి వరకు రూ. 9.23 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.38.01 కోట్లు వసూలు కావాల్సి ఉంది. జిల్లాలోని 74 మేజర్ గ్రామ పంచాయతీలలోనూ పన్నులను 30 శాతం మాత్రమే వసూలు చేశారు. ఇంటి పన్ను, నల్లా బిల్లులు, మార్కెట్ సెస్సు, లెసైన్సు ఫీజు, సెల్‌టవర్ స్థలాల అద్దెలను సిబ్బంది నెలనెలా కచ్చితంగా వసూలుచేయాలి. కానీ, ఎక్కడా ఇది సక్రమంగా సాగడం లేదు. దీంతో పంచాయతీలకు నిధులు సమకూరక ప్రజలకు సౌకర్యాలు అందడం లేదని అంటున్నారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శుల కొరత సైతం పన్నుల వసూళ్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో 718 పంచాయతీలు ఉంటే 200 మంది కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు.
 నోటీసులు జారీ
 గ్రామాలలో పన్నుల వసూళ్లు కుంటుపడడంతో అధికారులు స్పందించారు. బకాయి పడిన రూ.38.01 కోట్ల పన్నులను రాబట్టేందుకు చర్యలు చేపట్టారు. బకాయిలు చెల్లించని వారికి డిమాండ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. దీంతో కార్యదర్శులు పన్ను బకాయి దారులకు నోటీసులు జారీ చేయడం మొదలు పెట్టారు. గడువులోగా బకాయిలును చెల్లించకుంటే చట్టపరమైన తీసుకుంటామని హెచ్చరికలు చేస్తున్నారు. రాష్ట్ర అధికారులు కూడా జిల్లాలో పన్నుల వసూలు తీరుపై  అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 ప్రేక్షక పాత్ర
 గ్రామ పంచాయతీ కార్యదర్శులు డీఎల్‌పీఓలు, ఈఓపీఆర్‌డీల ఆధీనంలో పని చేస్తారు. వీరు కార్యదర్శులకు పన్ను వసూళ్ల విషయంలో ఏనాడు సమావేశాలు నిర్వ హించి మార్గదర్శకాలు జారీ చేసిన  సందర్భాలు లేవని సంబంధితలే వర్గాలు పేర్కొంటున్నాయి.
 చర్యలు తీసుకుంటున్నాం..
 -సురేశ్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి

 జిల్లాలో బకాయి పడిన పన్నులను రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లక్ష్యం మేరకు 38.01 కోట్లు వసూలు చేయాలని జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులను ఆదే శించాం. పన్నులు కట్టని వారికి నోటీసులు ఇవ్వాలని సూచించాం.
 

Advertisement
 
Advertisement
Advertisement