ఉద్యోగుల సమ్మెకాదు.. ప్రజా ఉద్యమం:అశోక్ బాబు | Ours is not a strike, its a people movement: APNGO's president ashok babu | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సమ్మెకాదు.. ప్రజా ఉద్యమం:అశోక్ బాబు

Aug 21 2013 3:40 PM | Updated on Mar 23 2019 9:03 PM

ఉద్యోగుల సమ్మెకాదు.. ప్రజా ఉద్యమం:అశోక్ బాబు - Sakshi

ఉద్యోగుల సమ్మెకాదు.. ప్రజా ఉద్యమం:అశోక్ బాబు

సమైక్యాంధ్ర ఉద్యోగుల సమ్మెను హైకోర్టు తప్పు పట్టిందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యోగుల సమ్మెను హైకోర్టు తప్పు పట్టిందని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు బుధవారం విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు. రాష్టంలో జరుగుతోంది ఉద్యోగుల సమ్మె కాదని... ప్రజా ఉద్యమం అని ఆయన అభిప్రాయపడ్డారు. తమను హైకోర్టు తప్పు పట్టిన... తాము చేపట్టిన ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమని నిరాకరించిన సెప్టెంబర్ 7న సమైక్యాంధ్ర సభను నిర్వహించి తీరుతామని ఆయన పేర్కొన్నారు.



అయితే రాష్ట్ర విభజనకు నిరసనగా ఎపీఎన్జీవో చేపట్టిన సమ్మెపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని మీరెలా సవాల్ చేస్తారని హైకోర్టు ఎపీఎన్జీవోల సంఘాన్ని ప్రశ్నించింది. సమ్మె చేయాలని మీకు అంతగా ఆసక్తి ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి సమ్మెలో పాల్గొనాలని ఎపీఎన్జీవోలకు సూచించింది.

 

సమ్మెకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కొంత గడువు కావాలని ఏపీఎన్జీవో సంఘం హైకోర్టును కోరింది. దాంతో ఆ కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఏపీఎన్జీవోలు చేపట్టిన సమ్మె అనైతికం అంటూ రవికుమార్ అనే న్యాయవాది  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

రవికుమార్ వేసిన పిటిషన్ బుధవారం హైకోర్టులో వాదనకు వచ్చింది. హైకోర్టులో జరిగిన వాదనకు ఎపీఎన్జీవోల తరుఫున సీమాంధ్ర సచివాలయం ఉద్యోగులు ఫోరం హజరైంది. అయితే బుధవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు విశాఖపట్నంలోని పైవిధంగా స్పందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement