బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురిపై నిర్భయ కేసు | nirbhaya case on three members due to kidnap a girl | Sakshi
Sakshi News home page

బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురిపై నిర్భయ కేసు

Dec 31 2013 12:13 AM | Updated on Sep 2 2017 2:07 AM

ఓ విద్యార్థిని వెంటపడి కిడ్నాప్ చేసి వేధించిన ముగ్గురిపై రామచంద్రాపురం పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు.

రామచంద్రాపురం, న్యూస్‌లైన్:  ఓ విద్యార్థిని వెంటపడి కిడ్నాప్ చేసి వేధించిన ముగ్గురిపై రామచంద్రాపురం పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జీవనోపాధికోసం మరో రాష్ట్రం నుంచి వచ్చిన ఓ కుటుంబం రామచంద్రాపురంలో స్థిరపడింది. ఈ కుటుంబంలోని 15 సంవత్సరాల బాలిక స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. ఈ బాలిక చదువుతున్న పాఠశాలలో ఓ కార్యక్రమం నిర్వహించగా, బెల్ విద్యుత్‌నగర్‌కు చెందిన మతిన్ డెకరేషన్ చేసేందుకు వెళ్లాడు.

 ఆ సమయంలోనే బాలికపై కన్నేసి అతను మాటల్లో దింపి తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. తరచూ బాలికతో ఫోన్‌లో మాట్లాడుతూ అప్పుడప్పుడూ కలిసేందుకు ప్రయత్నించేవాడు. ఈ క్రమంలోనే తన మిత్రులైన రామచంద్రాపురానికి చెందిన ఆటోడ్రైవర్ సుల్తాన్, జవహర్‌నగర్‌కు చెందిన టెన్నీస్ కోచ్ మహేశ్‌లను బాలికకు పరిచయం చేశాడు. వీరంతా బాలికను అప్పుడప్పుడూ పాఠశాల నుంచి ఆటోలో తీసుకెళ్లి ఇంటివద్ద దింపేవారు. ఈ క్రమంలోనే ఈ నెల 26న మతిన్, సుల్తాన్, మహేశ్‌లు హైదరాబాద్ చూపిస్తామంటూ బాలికకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకువెళ్లారు.

 అనంతరం హైదరాబాద్ నుండి ఆ బాలిక ను బీదర్‌కు తీసుకెళ్లారు. అయితే ఉదయం పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక ఇంట్లో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేయగా బాలిక బీదర్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు శనివారం బీదర్‌కు వెళ్లి బాలికతో పాటు ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. అనంతరం నిందింతులను తమదైనశైలిలో విచారించిన పోలీసులు వారు తెలిపిన వివరాల మేరకు వారిపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement