‘నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’ | Sakshi
Sakshi News home page

‘నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’

Published Thu, Jul 18 2019 8:29 AM

Ninnu Veedani Nedanu Niney Movie Success Meet In Jangareddy Gudem - Sakshi

సాక్షి, జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి) : మంచి సినిమాని, నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘నిను వీడని నీడను నేనే’ చిత్ర నిర్మాత, హీరో సందీప్‌ కిషన్‌ అన్నారు. ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం విజయోత్సవంలో భాగంగా బుధవారం చిత్ర యూనిట్‌ జంగారెడ్డిగూడెం వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక జెట్టి గురునాథరావు అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం నిర్మాతగా తనకు తొలి చిత్రం అని, ఏడాది గ్యాప్‌ తరువాత హీరోగా చేశానన్నారు. సినిమా పోస్టర్‌ను చూసి ప్రేక్షకులు హర్రర్‌ సినిమా అనుకున్నారని, సినిమాలో చాలా సందర్భాల్లో భయపడ్డామని, కాని చివర్లో కన్నీళ్లు వచ్చాయని వారు పేర్కొనడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఆంజనేయస్వామి అంటే చాలా సెంటిమెంట్‌ అని సందీప్‌ కిషన్‌ అన్నారు. మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నానని, ఇకపై ప్రతి సినిమాకు ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

తన తర్వాత చిత్రం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో  హన్సిక హీరోయిన్‌గా  ఓ సినిమా చేస్తున్నట్లు  చెప్పారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమా తర్వాత పూర్తి కామెడీ చిత్రంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. హీరోయిన్‌ అన్యాసింగ్‌ మాట్లాడుతూ నిను వీడని నీడను నేనే చిత్ర కథ, కథనం విభిన్నంగా ఉంటాయన్నారు. మరో నిర్మాత దయ పన్నెం మాట్లాడుతూ చిత్రానికి మంచి ఆదరణ వస్తోందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత సుప్రియ కంచర్ల మాట్లాడుతూ చిత్రం కొత్త కథ అని, దర్శకుడు కార్తీక్‌ రాజ్‌ చిత్రాన్ని చాలా బాగా తీశారన్నారు. చిత్ర బృందానికి మద్దాల ప్రసాద్, వలవల తాతాజీ, మైరెడ్డి పవన్, వసంతాటి మంగరాజు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శివచెర్రి, యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement