కృష్ణా జిల్లాలో ఎన్‌ఐడీఎం ‘దక్షిణ’ క్యాంపస్‌ | NIDM 'South' campus in Krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో ఎన్‌ఐడీఎం ‘దక్షిణ’ క్యాంపస్‌

Jul 6 2017 1:25 AM | Updated on Aug 20 2018 9:18 PM

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం) దక్షిణ భారత క్యాంపస్‌ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది.

సాక్షి, అమరావతి : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐడీఎం) దక్షిణ భారత క్యాంపస్‌ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. కృష్ణా జిల్లా కొండపావులూరులో దీనిని నిర్మించనున్నారు. ప్రస్తుతం దేశం మొత్తానికి ఢిల్లీలో ఒక్కచోటే ఎన్‌ఐడీఎం ప్రధాన కార్యాలయం ఉంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం ఎన్‌ఐడీఎం దక్షిణ భారత క్యాంపస్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విపత్తులను ఎదుర్కోవడంపై శిక్షణ ఇవ్వడం, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం పెంచడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. మొదట దీనిని గుంటూరు జిల్లాలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

అయితే దీనికి కేటాయించిన భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో ఎన్‌ఐడీఎం ఏర్పాటులో జాప్యం అనివార్యమైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్‌ఐడీఎంకు స్థలం కేటాయించింది. దీనిని పరిశీలించిన ఎన్‌ఐడీఎం ప్రతినిధులు ఇక్కడ కేంద్రం ఏర్పాటుకు సమ్మతించారు. 12 రాష్ట్రాల విపత్తు నిర్వహణ సంస్థలకు ఇది సేవలందించనుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు సహాయక దళాలకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. కొండపావులూరులో ఎన్‌ఐడీఎం ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులు అంగీకరించారని, త్వరలో నిర్మాణ పనులు చేపట్టనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. 2016 – 17 బడ్జెట్‌లోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్‌ఐడీఎం ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించింది. 

Advertisement
 
Advertisement
Advertisement