ఇప్పటి వరకు నిత్యావసర సరకుల పంపిణీకి వినియోగించే రేషన్ కార్డులు మారనున్నాయి. వీటి స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
శ్రీకాకుళం : ఇప్పటి వరకు నిత్యావసర సరకుల పంపిణీకి వినియోగించే రేషన్ కార్డులు మారనున్నాయి. వీటి స్థానంలో కొత్తగా స్మార్ట్ కార్డులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంబంధిత జీఓ 18ని ఈ నెల 1న రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. దీనిప్రకారం రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీలో ఎనిమిదిమంది సభ్యులుంటారు. కమిటీ చైర్మన్గా జె.సత్యనారాయణ వ్యవహరిస్తారు. మరో ఏడుగురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. కార్డుల తయారీ, తదితర అంశాల బాధ్యతలను రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 13 మంది ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. స్మార్ట్ కార్డుల తయారీలో మరింత నాణ్యతతో కూడిన కార్డులు, బహుళ ప్రయోజనం ఉండేలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డులను ప్రస్తుతం ఉన్న అన్ని కార్డు ల వినియోగదారులకు అందజేస్తారా? కొందరికేనా అనేది తెలియాల్సి ఉంది. నియమనిబంధనలు మరో 15రోజుల్లో విడుదల కానున్నాయి. స్మార్డు కార్డులో కొత్తగా ఆధార్ నంబరు, పింఛనుదారైతే వారి పింఛను ఐడీ నంబరు, ఫొటోతో కూడిన వ్యక్తిగత వివరాలు ఉంటాయి.