స్థానిక టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి మున్సిపల్ ఉద్యోగి చాప త్రినాథరావు(చిన్ని) (43) ఆదివారం మృతి చెందాడు.
రైలు కింద పడి మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్య
Jan 20 2014 2:55 AM | Updated on Nov 6 2018 7:53 PM
పార్వతీపురం టౌన్, న్యూస్లైన్ :స్థానిక టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి మున్సిపల్ ఉద్యోగి చాప త్రినాథరావు(చిన్ని) (43) ఆదివారం మృతి చెందాడు. జీఆర్పీ హెచ్సీ జి.వి.ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం... పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన తోటపల్లి పంపుహౌస్ వద్ద తాగునీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న చాప త్రినాథరావు శనివారం దోమలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆదివారం ఉదయం అతను ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో రాయగడ నుంచి పార్వతీపురం వైపు వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మనస్తాపంతోనేనా..?
త్రినాథరావు సుమారు రెండేళ్ల క్రితం నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. భార్యతో గొడవలు పడి విడిపోయినట్లు సమాచారం. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సహచర ఉద్యోగులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోకవడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారమే ఆత్మహత్య చేసుకునేందుకు అతను ప్రయత్నించాడు. స్థానికులు అప్రమత్తం కావడం, వైద్యులు సకాలంలో స్పందించి చికిత్స అందించడంతో అతను కోలుకున్నాడు. అయితే, ఆదివారం ఆస్పత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా పరారై, మరోమారు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈసారి మృతి చెందడంతో తోటి ఉద్యోగులు, స్థానికులు కన్నీటిపర్యంతమవుతున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement