సినిమా థియేటర్‌లో తొక్కిసలాట | Movie theater stampede | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్‌లో తొక్కిసలాట

Oct 2 2014 1:09 AM | Updated on Aug 21 2018 11:39 AM

‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విడుదల సందర్భంగా బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఓ అభిమాని ప్రాణాన్ని బలిగొంది.

ఎమ్మిగనూరులో ఒకరి మృతి

ఎమ్మిగనూరు: ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విడుదల సందర్భంగా బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఓ అభిమాని ప్రాణాన్ని బలిగొంది. అభిమాన హీరో రాంచరణ్ నటించిన సినిమాను మొదటి రోజే చూడాలని ఎమ్మిగనూరులోని బుడగజంగాల కాలనీకి చెందిన కన్నయ్య(19) ఒక రోజు ముందే టికెట్ కొనుగోలు చేసి స్నేహితులతో కలసి థియేటర్‌కు చేరుకున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు థియేటర్ గేట్లు ఒక్కసారిగా తెరవడంతో అప్పటికే అక్కడ గుమికూడిన అభిమానులంతా లోపలికి తోసుకెళ్లారు.

ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో కన్నయ్య కింద పడి ప్రాణాలొదిలాడు. విషయం తెలుసుకున్న బంధువులు థియేటర్ వద్దకు చేరుకుని హీరో ఫ్లెక్సీలను తగులబెట్టి ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. మృతునికి రెండు నెలల్లో వివాహం జరగనున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement