లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి బాలికపై లైంగికదాడి  | Molestation Attack On 16 years Old Girl | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి బాలికపై లైంగికదాడి 

Dec 9 2019 5:12 AM | Updated on Dec 9 2019 5:12 AM

Molestation Attack On 16 years Old Girl - Sakshi

చంద్రగిరి: ద్విచక్ర వాహనంలో లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి ఇద్దరు యువకులు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. 16 ఏళ్ల బాలిక నవంబర్‌ 24న ఇంట్లో గొడవతో అలిగి తిరుపతికి చేరుకుంది. అదేరోజు అర్ధరాత్రి తిరుపతి పద్మావతీపురం నుంచి కాలినడకన తిరుచానూరుకు వెళుతోంది. ఈ క్రమంలో చిత్తూరుకు చెందిన వెంకటేష్‌ (31) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా బాలిక తిరుచానూరు వరకు లిఫ్ట్‌ కోరింది. ఆమెను తన వాహనంపై ఎక్కించుకున్నాడు.

తిరుచానూరులో ఆమెను వదిలిపెట్టకుండా ముళ్లపూడి వరకు తీసుకెళ్లాడు. అక్కడ వాహనాన్ని ఆపి, పెట్రోల్‌ అయిపోయిందని ఆమెను నమ్మించాడు. స్నేహితుడు బుక్కే రాజమోహన్‌నాయక్‌ (28)ను పెట్రోల్‌ తీసుకురమ్మని చెప్పినట్లు పేర్కొన్నాడు. రాజమోహన్‌నాయక్‌ రాగానే ఇద్దరూ రోడ్డుపై నుంచి ఆమెను బలవంతంగా ముళ్లపొదల్లోకి తీసుకెళ్లి, లైంగికదాడి చేశారు. ఆమె అరుపులతో స్థానికులు అక్కడకు చేరుకోవడంతో పారిపోయారు. ఘటనను బాలిక ఏడుస్తూ తల్లిదండ్రులకు వివరించింది. వారు తిరుచానూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం ఇద్దరు నిందితులను తిరుచానూరులో అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాజమోహన్‌నాయక్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement