కాంగ్రెస్ పెద్దల ఉచ్చులో ఎమ్మెల్యేల విలవిల | mla's are struggling in congress rule | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పెద్దల ఉచ్చులో ఎమ్మెల్యేల విలవిల

Dec 20 2013 6:56 AM | Updated on Mar 18 2019 7:55 PM

ఢిల్లీ, హైదరాబాద్‌ల్లోని కాంగ్రెస్ పెద్దలు పన్నిన సమైక్య ఉచ్చులో అడ్డంగా చిక్కుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో విలవిల్లాడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఢిల్లీ, హైదరాబాద్‌ల్లోని కాంగ్రెస్ పెద్దలు పన్నిన సమైక్య ఉచ్చులో అడ్డంగా చిక్కుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో విలవిల్లాడుతున్నారు. పార్టీ పెద్దల మాటలు విని దారుణంగా మోసపోయామని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. జనాన్ని కాదని మొండిగా ముందుకు వెళితే ఫలితం ఎలా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందని భయపడుతున్నారు.
 
 దిక్కుతోచని స్థితిలో భారతి
 టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే జనం మద్దతు కోల్పోయిన ఆమెకు కొందరు మంత్రుల అండ ఉన్నా ఎలాంటి ప్రయోజనం దక్కేలా లేదు. సమైక్యాంధ్ర ఉద్యమకారులకు ఆమె కనీస భరోసా కూడా ఇవ్వలేదు. శాసనసభలో చర్చిస్తామని చెబుతూ తప్పించుకు తిరిగారు. ఇప్పుడు కథ అడ్డం తిరగటంతో కంగుతిన్నారు. శాసనసభ గురువారం నిరవధికంగా వాయిదా పడింది. దీంతో అభిప్రాయం చెప్పేందుకు అవకాశం కూడా లేకుండాపోయింది. రాష్ర్ట విభజన బిల్లుపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ స్పీకర్‌కు లేఖ ఇవ్వాల్సి ఉన్నా ఆమె ఆ పని చేయకపోవటం గమనార్హం.
 
 జనానికి దూరంగా సత్యవతి
 ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి మంత్రుల బాటలోనే నడిచారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణను కోరుకుంటున్న ప్రజలకు దూరంగా ఉండిపోయారు. సమైక్య ఉద్యమంపై సరిగా స్పందించకపోగా.. దీనిపై మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని, పార్టీ పెద్దలు ఏది చెబితే అదే తన మాటని చెప్పుకొచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆమదాలవలస పట్టణం హోరెత్తినా ఒక్క కార్యక్రమంలోనూ ఆమె పాల్గొనలేదు. దీంతో ఇప్పుడు జనం మధ్యకు వచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు.
 
 డీలా పడిన మీసాల
 ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు సమైక్యవాదుల పట్ల తొలుత దురుసుగా వ్యవహరించారు. చివరకు సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. అయితే ప్రత్యక్ష ఉద్యమంలో మాత్రం పాల్గొనలేదు. దీంతో చాలా కార్యక్రమాల్లో ఆయన్ను జనం అడ్డుకున్నారు. నిలదీశారు. సమైక్య నినాదం చేయకుంటే కుదరదని హెచ్చరించారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు పుట్టగతులుండవన్న ఆందోళనతో మీసాల డీలా పడిపోయారు.
 
 సుగ్రీవులు రాజకీయం సరి
 సమైక్య ఉద్యమాన్ని, ప్రజల ఆకాంక్షను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులుకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ పార్టీ వర్గాలే అంటున్నాయి. కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ చెప్పినట్టే చేస్తానని, జనాభీష్టంతో సంబంధం లేదని సుగ్రీవులు పలుమార్లు తెగేసి చెప్పారు. కిశోర్ చంద్రదేవ్ చుట్టూ ప్రదక్షిణలకై పరిమితమైన సుగ్రీవులును ప్రజలు ఆదరించే పరిస్థితి లేనే లేదని నియోకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు.
 
 కోండ్రుకు గడ్డు రోజులు
 రాజాం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కోండ్రు మరళి అనేకసార్లు జనాగ్రహానికి గురయ్యారు. సమైక్య ఉద్యమ సమయంలో పోలీసుల సాయంతో తప్పించుకొని వెళ్లాల్సి వచ్చింది. మొదట సమైక్య వాదం గురించి అస్సలు మాట్లాడని ఆయన, చివర్లో తానూ సమైక్యవాదినేనని, అసెంబ్లీలో తేలుస్తానని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఆ ప్రగల్భాలు ఏమయ్యాయో కాని శాసనసభలో సీమాంధ్ర, తెలంగాణ ఎమ్మెల్యేలు నెట్టుకోవడం చూస్తూ ఆనందిస్తున్నారు. ఆయన తీరును టీవీల్లో చూస్తున్న జనం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై మండిపడుతున్నారు. దీంతో ఆయనకూ గడ్డు రోజులు తప్పవని స్పష్టమవుతోంది.
 
 ఎవరికీ పట్టని శత్రుచర్ల
 ఇక పాతపట్నం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. సమైక్య ఉద్యమంలో పాలుపంచుకోని ఆయనను జనం అస్సలు విశ్వసించటం లేదు. ఉద్యమ సమయంలో తనను అడ్డుకున్నవారిపై ఆగ్ర హం వ్యక్తం చేసిన ఆయనపై అందరిలోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో భవిష్యత్తులో ఆయనకు జనం అండగా నిలిచే పరిస్థితి లేదు.
 
 ధర్మానపైనా వాగ్బాణాలు..
 శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా సమైక్య వాదుల వాగ్బాణాలకు గురయ్యారు. ఆయన పాల్గొన్న అనేక సభల్లో సమైక్య నినాదాలు మిన్నంటాయి. శ్రీకాకుళంలో జరిగిన ఓ సమైక్య సభలో ఆయన మాట్లాడుతూ ‘ఏం.. మీరు చెబితే మేం వినాలా.. ఆలోచనా పరులుగా ఉండండి. అవివేకంతో ఉండొద్దు. బిల్లు శాసన సభకు వచ్చినప్పుడు చూద్దాం. సభలో సమైక్య వాదం వినిపిద్దాం. అప్పటి దాకా ఓపిక పట్టండి. రాజీనామా చేస్తే మీకొచ్చేదేంటి? చట్ట సభలో ప్రశ్నించే అవకాశం కోల్పోతాం’ అని జనానికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా జనం మాత్రం ఆయన మాటలు వినలేదు. శాసన సభలో వాదన వినిపించాలని ఆయన అనుకుంటున్నా అవకాశం వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.
 
 జుత్తు జగన్నాయకులది గడ్డు పరిస్థితి
 పలాస కాంగ్రెస్ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనం మధ్యలో ఆయన ఉండలేకపోతున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎలా చెబితే అలా చేస్తానని చెప్పుకోవడంతోనే సరిపోయింది. తన మాట. తన ఓటు అసెంబ్లీలో అవసరమవుతాయని చెప్పుకొచ్చారు. వీటి సంగతి సరే.. కనీసం అభిప్రాయాన్ని వెలిబుచ్చేందుకు కూడా శాసనసభలో ఆయనకు అవకాశం రాలేదు. రాష్ట్ర విభజన బిల్లుపై మాట్లాడేందుకు ఈయనా స్పీకర్‌కు వినతిపత్రం ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎలా మాట్లాడతారనేది పలువురి వాదన.
 కేంద్ర మంత్రి కృపారాణికి కష్టకాలం..
 శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కార్యాలయాన్ని చాలాసార్లు సమైక్య వాదులు ముట్టడించి నిరసన తెలిపారు. అయినా ప్రజల మనోభావాలను ఆమె గౌరవించలేదు. ప్రజల సమైక్య ఆకాంక్షను ఢిల్లీ పెద్దలకు చెప్పడంలో విఫలమయ్యారు. అధికారిక కార్యక్రమాలకు, సొంత ప్రయోజనాలకు మాత్రమే ఆమె ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రం ముక్కలవుతుంటే చేతులు ముడుచుకొని కూర్చున్న ప్రజాప్రతినిధులను కలుపుకొని ఆందోళన పథంలో అడుగులు వేయాల్సిన కేంద్ర మంత్రి కనీసం మాట కూడా మాట్లాడలేదని.. అలాంటి ఆమె ఇప్పుడు జనం మధ్యకు ఎలా వస్తారో చూస్తామని సమైక్యవాదులు అంటున్నారు. దీంతో కృపారాణికి కష్టకాలం వచ్చినట్టేనని కాంగ్రెస్ పార్టీ వారే చెబుతున్నారు.
 
 టీడీపీ నేతల్లో కలవరం
 టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి రెండు కళ్ల సిద్ధాం తంతో జిల్లా నేతలు కలవరపడుతున్నారు. స్పష్టత లేని వైఖరితో ఆయన కొంప ముంచారని వాపోతున్నారు. సమైక్య ఉద్యమంలో ముందుండి పోరాడేవారికే జనం బ్రహ్మరథం పడతారని, మిగిలిన వారిని అంగీకరించే స్థితిలో లేరని రాష్ట్ర నేతల వద్ద చెప్పుకొని బాధపడుతున్నా రు. తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఆవేదన చెందుతున్నారు. దీంతో వ్యక్తిగత కష్టాలు చెప్పుకుంటూ జనం సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement