
సాక్షి, పశ్చిమ గోదావరి: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రి శ్రీరంగనాథ రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నివారణ చర్యలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున కోటి రూపాయలను విరాళంగా అందజేస్తామని పేర్కొన్నారు. పశ్చిమగోదావరిలో కరోనా వైరస్ నివారణ చర్యలపై వైద్యశాఖ మంత్రి ఆళ్ల నానితో కలసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించామని వెల్లడించారు. కరోనా మహమ్మారిని పూర్తిస్థాయిలో తరిమికొట్టేందుకే ఏపీ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిందని పేర్కొన్నారు. (ఏపీ: కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు)
ప్రజలందరూ సహకరించి కచ్చితంగా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనా వైరస్ను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ఆయన సూచించారు. ఇతర దేశాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు మనకు రాకూడదనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు.
(కరోనా.. తెలుగు రాష్ట్రాలకు నితిన్ విరాళం)