ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు కనిపించే ఎత్తయిన పర్వత సానువులు.. వాటిమధ్య అందంగా ఒదిగిపోయిన లోయలు.. వాటిపై చిక్కని ఆకుపచ్చదనంతో...
ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు కనిపించే ఎత్తయిన పర్వత సానువులు.. వాటిమధ్య అందంగా ఒదిగిపోయిన లోయలు.. వాటిపై చిక్కని ఆకుపచ్చదనంతో అలరారే వృక్షాలు.. ఒంపులు తిరుగుతూ సాగే కొండ వాగులు.. కొండలపై నుంచి ఘోష చేస్తూ దూకే జలపాతాలు.. కిలకిలారావాలు చేసే రకరకాల విహంగాలు.. అరుదైన జంతు సమూహాలు.. ఇటువంటి ప్రకృతి అందాలకు ‘తూర్పు’ మన్యం ఆటపట్టు. ఇటువంటి సహజ సౌందర్యలహరిలో సాగే గిరిజనుల జీవనం, సంస్కృతి ఎంతో అపురూపంగా కనిపిస్తుంది. ఈ గిరి సంస్కృతిని ప్రతిబింబించే మూడు రోజుల పండగకు మన్యసీమ ముస్తాబైంది. ఈ నేపథ్యంలో మన మన్యం విశిష్టతలపై విహంగ వీక్షణం..
- అమలాపురం/రంపచోడవరం/మారేడుమిల్లి
* మంత్రముగ్ధుల్ని చేస్తున్న మన్యసీమ సౌందర్యం
* రమణీయ ప్రకృతి అందాలకు ఆలవాలం
* మరెన్నో విశిష్టతలు ఈ సీమ సొంతం
గిరుల నుంచి సిరులు..
కలప, గిరిజనోత్పత్తులు, లాటరైట్ గనులు, రెడ్ మెటల్, బ్లాక్మెటల్కు మన్యంలోని గిరులు నిలయం. ఇవి ప్రభుత్వానికి సిరులు కురిపిస్తున్నాయి. సహజసిద్ధంగా లభించే తేనె, అడ్డాకులు, కరక్కాయలు, చింతపండు, కొండచీపుర్లు, శీకాయలు, కుంకుకాయలు, తాటి ఉత్పత్తులు గిరిజనులకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటాయి. అలాగే కమలా, దబ్బ, నిమ్మజాతులు, మామిడి, జీడిమామిడి, అనాస, పనస, పంపరపనసలకు మంచి గిరాకీ ఉంది. పాడేరు తరువాత అత్యంత శ్రేష్టమైన కాఫీ పండుతున్నది ఇక్కడే. రబ్బరు ఉత్పత్తితో కూడా ఇక్కడి గిరిజనులు ఆదాయం పొందుతున్నారు. ఏజెన్సీలో లభించే నాణ్యమైన టేకు, రోజ్వుడ్కు మంచి గిరాకీ ఉంది.
నేటి నుంచి ‘మన్యం జాతర’
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే రీతిలో.. ఏజెన్సీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లిలోని ‘వనవిహారి’ వేదికగా శనివారం నుంచి ‘మన్యం జాతర’ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. మన రాష్ట్రంతోపాటు, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి గిరిజనులు ఈ జాతరకు తరలిరానున్నారు. ఈ సందర్భంగా గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచుతారు. అలాగే ఈ మూడు రోజులూ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
విభజనతో కీలకంగా మారిన ఏజెన్సీ
రాష్ట్ర విభజనతో తూర్పు మన్యం కీలకంగా మారింది. కొత్తగా నాలుగు మండలాలు కలవడంతో ఏజెన్సీ విస్తీర్ణం భారీగా పెరిగింది. అంతకుముందు రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల, గంగవరం మండలాలుండగా, విలీనం తరువాత చింతూరు, వీఆర్ పురం, కూనవరం, నెల్లిపాక మండలాలు వచ్చి చేరాయి. ఇవి గతంలో భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి. గతంలో ఏజెన్సీ విస్తీర్ణం 4,44,582 హెక్టార్లు కాగా, విలీన మండలాల చేరిక తరువాత 6,43,182 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఏజెన్సీ జనాభా 2,17,487 కాగా, విలీనానంతరం ఇది 3,52,487కు పెరిగింది.
ఎన్నెన్నో అందాలు..
రంప జలపాతం
రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వెళ్లే రహదారిని ఆనుకుని రంపచోడవరం సమీపాన ఈ జలపాతం ఉంది. బస్సుల ద్వారా రంపచోడవరం చేరుకుని అక్కడ నుంచి ఆటో, ఇతర వాహనాలపై పంచాయతీ కార్యాలయం వైపు నుంచి ఉన్న రంప రోడ్డులో రెండు కిలోమీటర్లు ప్రయాణించాలి. రంప కొండ దిగువన ఉన్న శివాలయం నుంచి కాలినడకన కిలోమీటరు వెళితే జలపాతం, శివాలయం ఉంటాయి. శివాలయం పక్కనుంచి అర కిలోమీటరు కొండ ఎక్కితే మరో పెద్ద జలపాతం దర్శనమిస్తుంది.
జలతరంగణి
భద్రాచలం రోడ్డులో మారేడుమిల్లికి ఏడు కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి ఉంది. ఇక్కడ సేద తీరేందుకు ఎకో టూరిజం హట్లు ఉన్నాయి. ఇక్కడినుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే పాములేరు వాగు వస్తుంది.
జంగిల్స్టార్ క్యాంప్
దట్టమైన అడవిలో గుడారాలు వేసుకుని రాత్రులు గడపాలనుకునే సాహస పర్యాటకులకు జంగిల్స్టార్ క్యాంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాములేరు పక్కన లంక వంటి ప్రాంతంలో దీనిని నిర్మించారు. సుమారు 20 హట్లున్నాయి. రోజుకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకూ ఖర్చవుతుంది. 15 మంది 25 మంది వరకూ ఉంటారు. అక్కడ ఉన్న ఎకో టూరిజం సభ్యులు అడవిలో రాత్రి పూట సంచరించేందుకు పర్యాటకులకు సహాయపడతారు. భద్రాచలం రోడ్డులో మారేడుమిల్లికి 15 కిలోమీటర్ల దూరంలో పాములేరును ఆనుకుని జంగిల్స్టార్ ఉంది. రాజమండ్రి, కాకినాడ నుంచి భద్రాచలం, ఎగువ సీలేరు వెళ్లే బస్సుల ద్వారా ఇక్కడకు చేరవచ్చు. మారేడుమిల్లి నుంచి ఆటోలు ఉంటాయి.
అమృతధార
మారేడుమిల్లి వద్ద పూర్తి అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతమిది. ఎత్తయిన కొండ పైనుంచి జాలువారుతూ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బస్సులలో మారేడుమిల్లి చేరుకుని అక్కడ నుంచి ఆటోలను ప్రత్యేకంగా అద్దెకు తీసుకుని వెళ్లాలి.
పొల్లూరు జలపాతం
ఏజెన్సీలో అతిపెద్ద జలపాతమిది. పెద్దపెద్ద రాళ్ల మధ్య నుంచి ఉధృతంగా ఉరికే నీరు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. బాహుబలి చిత్రంలో కనిపించే జలపాతంలా ఉంటుంది. చింతూరు నుంచి, మారేడుమిల్లి నుంచి ఎగువ సీలేరు, విశాఖ వెళ్లే బస్సులలో పొల్లూరు చేరుకోవాలి. అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పొల్లూరు జలపాతం ఉంది.
వనదేవతలకు పుట్టినిల్లు
గిరిజన దేవతలు, పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలకు మన్యం కేంద్రంగా నిలిచింది. దేవీపట్నం మండలం పోచమ్మగండి వద్ద ఉన్న పోచమ్మ అమ్మవారి ఆలయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. రంపచోడవరం మండలంలో బాపనమ్మ ఆలయాలు వనదేవతల నిలయాలుగా నిలుస్తున్నాయి. గంగాలమ్మ అమ్మవారి జాతరలు ఇక్కడ ఘనంగా సాగుతూంటాయి. రంపలోని శివాలయం, దేవీపట్నం ఉమా చోడేశ్వరస్వామి ఆలయాలు, విశ్వనాథుడు కొలువుదీరిన వై.రామవరం మండలం గురమంద ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అరుదైన జంతుజాతులు
మన ఏజెన్సీలో పలు రకాల పక్షి, జంతుజాతులున్నాయి. పెద్దపులులు, చిరుతలు, నెమళ్లు, అడవి పందులు, లేళ్లు, కొండగొర్రెలు, కణుజులు, కొండచిలువలు ఉన్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేక జాతికి చెందిన గొర్రగేదెల(బైసన్స్)కు ఈ ప్రాంతం ప్రత్యేకం.
జలసిరులు
మన ఏజెన్సీ అపార జలసిరికి ఆలవాలం. వీటివల్ల మైదాన ప్రాంతాలకు ఎక్కువగా మేలు జరుగుతోంది. ఏజెన్సీలో భూపతిపాలెం, సూరంపాలెం, మద్దిగెడ్డ, ముసురుమిల్లి, డొంకరాయి జలాశయాలున్నాయి. రాష్ర్ట విభజన తరువాత సీలేరు, శబరి పరీవాహక ప్రాంతాలు ఆంధ్రాలో విలీనం కావడం, ఇవన్నీ మన ఏజెన్సీ పరిధిలోకే రావడం.. ఇందువల్ల మైదాన ప్రాంతాలకు, ముఖ్యంగా గోదావరి డెల్టా రైతులకు ఎంతో మేలు జరుగుతోంది.
విద్యుత్ వెలుగులు
ఏజెన్సీలోని పొల్లూరు, డొంకరాయి విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి వెలుగులనిస్తున్నాయి. పొల్లూరులో 460 మెగావాట్లు, డొంకరాయిలో 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వీటితోపాటు అడ్డతీగలలోని వేటమామిడి వద్ద మినీ హైడల్ ప్రాజెక్టులున్నాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి.
స్వాతంత్య్రోద్యమంలో..
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలిసి బ్రిటిషర్లపై ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన చరిత్ర గిరిజనులకు ఉంది. పోలీసు స్టేషన్ల మీద దాడిచేసి తెల్లవారిని గడగడలాడించారు వీరు.