ర్యాగింగ్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం | making a Free State, Raging | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్ ఫ్రీ స్టేట్‌గా తీర్చిదిద్దుతాం

Aug 30 2015 3:00 AM | Updated on Sep 3 2017 8:21 AM

ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా

వీసీలతో సమీక్షలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు

విజయవాడ సెంట్రల్: ఆంధ్రప్రదేశ్‌ను ర్యాగింగ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన వీసీలు, రిజిస్ట్రార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడితే గతంలో టీసీ ఇచ్చి పంపేసేవారని, ఇప్పుడైతే శాశ్వతంగా విద్యకు దూరం చేస్తారని చెప్పారు. విద్యాసంస్థల అధిపతుల్ని బాధ్యుల్ని చేస్తామన్నారు. వైస్‌చాన్స్‌లరే యూనివర్సిటీకి కింగ్ అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో యూనివర్సిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేయడం కోసం త్వరలోనే సింగపూర్, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఫిన్‌ల్యాండ్ దేశాలతో పాటు దేశంలోని తమిళనాడు, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు వివరించారు. తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్ యూనివర్సిటీల విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని మంత్రి గంటా అన్నారు.

నారాయణను టార్గెట్ చేస్తారు : నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, కడపలో నారాయణ విద్యాసంస్థలో విద్యార్థిని మృతిపై అసెంబ్లీలో ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు అన్ని రకాలుగా సమాధానం చెప్పేలా రికార్డులు సిద్ధం చేయాలని ఆయన వీసీలకు సూచించారు. నారాయణ క్యాబినెట్‌లో మంత్రిగా ఉండటంతో పాటు తన బంధువు కూడా కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్షం టార్గెట్ చేస్తోందన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement