ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు అప్పగించిన తమకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు.
అరుణ్ జైట్లీకి రాజధాని రైతుల వినతి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు అప్పగించిన తమకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నేతృత్వంలో మాదాల రాజేంద్ర, మాదాల శ్రీనివాస్, కల్లం పానకాలరెడ్డి తదితరులు ఇదే వినతిపత్రాన్ని సీఎం చంద్రబాబు , కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు అందజేశారు.
తాము రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూముల వల్ల వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్ కింద పరిగణించవద్దని కోరారు. ఆదాయపు పన్నులో దీనికి సంబంధించి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా జైట్లీకి విజయవాడలోని ఓ హోటల్లో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ విందులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్గజపతిరాజు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.