దుర్నీతిపై దండయాత్ర | maha dharna succeed in Srikakulam | Sakshi
Sakshi News home page

దుర్నీతిపై దండయాత్ర

Dec 6 2014 3:42 AM | Updated on May 25 2018 9:17 PM

దుర్నీతిపై దండయాత్ర - Sakshi

దుర్నీతిపై దండయాత్ర

బధిర సర్కారు చెవికి సోకని జనం బాధలు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన మహాధర్నాలో సామాన్యుల గుండెల నుంచి తన్నుకొచ్చిన కన్నీటి గాధలు ఎన్నెన్నో.

కదిలివచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు
మద్దతుగా నిలిచిన ప్రజాదండు
పోలీసుల ఆంక్షలను అధిగమించి వేలాదిమంది హాజరు
శ్రీకాకుళంలో మహాధర్నా విజయవంతం
చంద్రబాబు పాలనను ఎండగట్టిన నేతలు, సామాన్యులు
ఇదే పరిస్థితి కొనసాగితే గుణపాఠం తప్పదని ెహ చ్చరిక
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బధిర సర్కారు చెవికి సోకని జనం బాధలు. శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన మహాధర్నాలో సామాన్యుల గుండెల నుంచి తన్నుకొచ్చిన కన్నీటి గాధలు ఎన్నెన్నో. రుణమాఫీ లేదు. ఫీజు రియింబర్స్‌మెంట్ రాదు. రుణాలు ఇవ్వరు. డ్వాక్రా సంఘాల మాటే మరిచారు. తుపాను బాధితుల్ని పక్కన పెట్టేశారు. సాయం పక్కదోవ పట్టింది. ఇసుకను బంగారంగా మార్చేశారు.  నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఉన్నవే ఊడగొడుతున్నారు. అంతా కార్పొరేట్ల పాలన.. ఆరునెలలైనా కాకముందే టీడీపీ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు వైఎస్‌ఆర్‌సీపీ మహాధర్నా వేదికగా నిలిచింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ మహాధర్నా అడుగడుగునా పోలీసుల ప్రతిబంధకాలను ఛేదించి మరీ విజయవంతమైంది. రైతులు, మహిళలు, వృద్ధులు, వితంతువులు, విద్యార్థులు, ఇసుక బళ్ల యజమానులు, సోంపేట బీల ప్రాంత వాసులు, తాపీ మేస్త్రీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున హాజరై చంద్రబాబు దుర్మార్గ పాలనను ఎండగట్టారు. ప్రధాన ప్రతిపక్షం చేపట్టిన ఆందోళన కార్యక్రమం తమదే అన్నట్లు వ్యవహరించారు.
 
ఇలా జరిగింది
ఉదయం ఆరు గంటల నుంచే జిల్లా నలువైపుల నుంచి నేతలు జిల్లా కేంద్రానికి బయల్దేరారు.
ఏడుగంటల నుంచి పోలీసులు ఆంక్షలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి ధర్నాకు వస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పెద్ద వాహనాలతోపాటు ద్విచక్ర వాహనాలనూ నిబంధనల పేరిట అడ్డుకున్నారు. తెలుగుదేశం నేతల ఒత్తిళ్లతో ఎక్కడికక్కడ భారీ బందోబస్తు పేరుతో ఆటంకాలు సృష్టించారు.
8 గంటల నుంచే ధర్నా వేదిక వద్ద ప్లకార్డులు, హోర్డింగ్‌లు, పోస్టర్లు వెలిశాయి. వైఎస్సార్‌సీపీ జెండాలు రెపరెపలాడాయి.
9 గంటలకే ధర్నా ప్రాంగణానికి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు, నాయకులు, ఎమ్మెల్యేలు రావడం మొదలెట్టారు.
11 గంటలకు కార్యక్రమం మొదలైంది. నాయకులు చంద్రబాబు దుర్నీతిని ఎండగట్టారు. బాధిత ప్రజలకు బాసటగా ఉంటామని ప్రసంగాలతో భరోసా ఇచ్చారు.  
ఎండ సుర్రున మండుతున్నా ఎవరూ వెరవలేదు. వేలాది జనం వేదిక వద్దే ఉండిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ఓ అవ్వ, ఓ వృద్ధుడు, ఓ భవన నిర్మాణ కార్మికుడు, ఓ ఇసుక బండి యజమాని, ఓ డ్వాక్రా సంఘం సభ్యురాలు తమ మాటల్లో వివరించారు.
మధ్యాహ్నం రెండుగంటల సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు జేసీ వివేక్ యాదవ్‌కు విజ్ఞాపన పత్రం అందించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు..ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ ఇబ్బందుల్ని విడమర్చి చెప్పారు.
అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించినా, వాహనాలను అడ్డుకున్నా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే తామంతా నడుస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement