స్థానిక సమరం 6న | local meeting starts on 6th | Sakshi
Sakshi News home page

స్థానిక సమరం 6న

Mar 10 2014 2:39 AM | Updated on Sep 17 2018 6:08 PM

స్థానిక సంస్థల ఎన్నికల తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

కడప సిటీ, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  ఏప్రిల్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 8 లేదా 9వ తేదీల్లో  కౌంటింగ్ చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. జిల్లా వ్యాప్తంగా 559 ఎంపీటీసీ, 50 జెడ్పీటీసీ, 50 మండల ప్రజాపరిషత్ స్థానాలు ఉన్నాయి. జిల్లాలోని గ్రామాలు, మండల పరిధిలో 13,39,317 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,57,854, స్త్రీలు 6,81,463 మంది ఉన్నారు.
 
 వీరంతా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత కలిగి ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వినియోగించనున్నారు. గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు తక్కువగా ఉండేవి.  ఓటర్ల సంఖ్య  పెరగడంతో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అనివార్యమైంది.   ఆయా మండల పరిధిలోని ఓటర్ల  సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అధికారులు  ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
 
 ఆయా గ్రామాల్లో పర్యటించి  పోలింగ్ కేంద్రాలకు అనువైన భవనాలను పరిశీలిస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం  ఈనెల 12న డ్రాఫ్టు జాబితా  రానుంది. 13న  పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రకటిస్తారు. 14వ తేదీన  అభ్యంతరాలు, మార్పులను తెలియజేయవచ్చు.
 15న రాజకీయ పార్టీలతో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం 16న  పోలింగ్ స్టేషన్ల జాబితాను  కలెక్టర్  ప్రకటిస్తారు. 18న జిల్లాలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ  ఎన్నికల పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను తెలియజేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement