
మావోయిస్టులపై నిషేధం ఎత్తివేయాలి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని శనివారం విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు.
విరసం నేత వరవరరావు డిమాండ్
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని శనివారం విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టబోతున్న టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. మావోయిస్టులతోపాటు వారి అనుబంధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలపై కేసులను కూడా ఎత్తివేయాలన్నారు.
జైళ్లలో ఉన్న మావోయిస్టులను రాజకీయ ఖైదీలుగా గుర్తించి, వారిలో ఏడు సంవత్సరాల శిక్ష పూర్తయినవారిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ అమలు చేయాలని కోరారు. అలాగే జాతీయ స్థాయిలో చర్చలకు సిద్ధమేనని మావోయిస్టు కార్యదర్శి గణపతి గతంలో ప్రకటించారని, అయితే మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించి నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రంలో అధికారంలోకి రానున్న బీజేపీని వరవరరావు డిమాండ్ చేశారు.