జిల్లా వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. జిల్లా మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ
పెంచిన ధరలు నేటి నుంచి అమలు
జిల్లాపై రూ.25 కోట్ల భారం
జోరుగా రిజిష్ట్రేషన్లు
అత్యధికంగా భోగాపురంలో 1300 డాక్యుమెంట్లుకు రిజిస్ట్రేషన్లు
విజయనగరం రూరల్ : జిల్లా వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. జిల్లా మార్కెట్ వాల్యూ రివిజన్ కమిటీ ఆమోదం తెలపడంతో శనివారం నుంచి ఆ ధరలు అమలులోకి రానున్నాయి. ధరల పెంపు కారణంగా జిల్లా వాసులపై రూ. 25 కోట్ల భారం పడునుంది. ఇప్పటికే భూముల విలువల పెంపుపై అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ధరలపై నూరు శాతం వరకు, బహిరంగ మార్కెట్ విలువల్లో 60 శాతం పెంచడానికి కమిటీ ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది. దీంతో స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖకు భారీ ఆదాయం లబించనుంది.
జోరుగా రిజిస్ట్రేషన్లు
భూముల ధరలు పెరగనుండడంతో దానికి అనుగుణంగా పెరిగే రిజిష్ట్రేషన్ ఖర్చుల భారం నుంచి తప్పించుకునేందుకు భూముల విక్రయదారులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గత వారం రోజుల్లో రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. రిజిస్ట్రేషన్ శాఖకు సుమారు 10 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. ఈ నెల 24 వరకు జిల్లా వ్యాప్తంగా 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 3913 డాక్యుమెంట్లు రిజిష్ట్రేషన్ జరగ్గా, 25 నుంచి 30వ తేదీ వరకు 2650 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఒక్క శుక్రవారంనాడే 900 రిష్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్కు జనాలు పోటెత్తడంతో రిజిష్ట్రేషన్ శాఖాధికారులు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేశారు.
అత్యధికంగా భోగాపురంలో రిజిస్ట్రేషన్లు
జిల్లాలో అత్యధికంగా భోగాపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ నెల ఒకటి నుంచి 30 వరకు 1300 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరగ్గా, కొత్తవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1031 రిజిస్ట్రేషన్లు జరిగాయి. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 25 నుంచి 30 వరకు 502, ఒక్క 31తేదీ నాడే 80 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొత్తవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం 575 రిజిస్ట్రేషన్లు జరిగాయి. విజయనగరం పశ్చిమ కార్యాలయంలో గత నాలుగు రోజులుగా సుమారు 255 డాక్యుమెంట్లుకు రిజిస్ట్రేషన్లు జరగగా, విజయనగరం ఓబీ కార్యాలయంలో బుధ, గురు వారాల్లో 383 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అత్యల్పంగా కురుపాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈనెల ఒకటి నుంచి 24 వరకు 40 డాక్యుమెంట్లుకు రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఈ నెల 25 నుంచి 31 వరకు 45 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
జిల్లా స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ శాఖ జూలై నెల లక్ష్యం రూ16.28 కోట్ల 22 నాటికి రూ. 11.53 కోట్ల ఆదాయం లభించింది. 25 నుంచి 31 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లద్వారా మరో రూ.11 కోట్ల ఆదాయం లభించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ఆదాయం వివరాలు ఉన్నతాధికారులకు పూర్తిస్థాయిలో అందలేదు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఇప్పటికే జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖకు భారీ ఆదాయం లభిస్తోంది. గత మూడు నెలల్లో 42 కోట్ల 38 లక్షల రూపాయలతో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ 127.27 శాతం లక్ష్యాన్ని సాధించింది.