హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లలో జోరు తగ్గింది. ఈ ఏడాదిలో డిసెంబర్ 25 నాటికి 5.45 లక్షల యూనిట్ల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ‘స్క్వేర్యార్డ్స్’ తెలిపింది. క్రితం ఏడాది 5.77 లక్షల యూనిట్ల రిజిస్ట్రేషన్లతో పోల్చి చూస్తే 5 శాతం తగ్గినట్టు వెల్లడించింది. కానీ, ప్రాపర్టీ రిజి్రస్టేషన్ల విలువ 11 శాతం పెరిగి 4.46 లక్షల కోట్లకు చేరినట్టు పేర్కొంది. 2024లో టాప్–9 నగరాల్లో ప్రాపర్టీ రిజి్రస్టేషన్ల విలువ 4.03 లక్షల కోట్లుగానే ఉంది. ఈ మేరకు ఒక నివేదికను స్క్వేర్యార్డ్స్ విడుదల చేసింది.
హైదరాబాద్, పుణె, థానే, ముంబై, నవీ ముంబై, బెంగళూరు, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల గణాంకాల ఆధారంగా వివరాలను వెల్లడించింది. మొదటిసారి రిజి్రస్టేషన్తోపాటు, సెకండరీ సేల్ (అప్పటికే వినియోగించిన ఇళ్లు విక్రయించడం) గణాంకాలు కూడా ఇందులో కలిసే ఉన్నాయి.
లగ్జరీ, ప్రీమియం ఇళ్ల హవా..
‘‘ఖర్చు పెట్టేందుకు వీలుగా అధిక ఆదాయం కలిగిన ధనవంతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో 2025 ప్రాపర్టీ రిజి్రస్టేషన్లలో ప్రీమియం, లగ్జరీ ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి’’అని స్క్వేర్యార్డ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో తనుజ్ షోరి పేర్కొన్నారు. గత మూడు నుంచి ఐదేళ్ల కాలంలో పలు మార్కెట్లలో ఇళ్ల ధరలు స్థిరంగా పెరుగుతూ రావడంతో కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తోందన్నారు.
‘‘డిమాండ్ బలంగా ఉంది. 2026లో లగ్జరీ విభాగంలో వృద్ధి అన్నది మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చు. మార్కెట్ నిదానించడం కాకుండా స్థిరీకరణకు గురి కావొచ్చు’’అని పేర్కొన్నారు. అయితే 2026లోనూ ఇళ్ల మార్కెట్లో స్థిరమైన పురోగతి నెలకొంటుందని, మధ్యాదాయ మార్కెట్లో డిమాండ్ క్రమంగా సర్దుబాటుకు గురికావొచ్చని స్క్వేర్యార్డ్స్ నివేదిక తెలిపింది.
ట్రిబెకా డెవలపర్స్ గ్రూప్ సీఈవో రజత్ ఖండేల్వాల్ ఈ నివేదికపై స్పందిస్తూ.. కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్టుల పట్ల కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రీమియం, పెద్ద ఇళ్లకు డిమాండ్ నిలకడగా ఉన్నట్టు ఆల్ఫా కార్ప్ డెవలప్మెంట్ లిమిటెడ్ సీఎఫ్వో సంతోష్ అగర్వాల్ వెల్లడించారు.
ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల తగ్గుదల.. కారణం ఇదేనా?


