భయం.. భయంగా.. | KGBV Girls Fear In Without Compound Walls | Sakshi
Sakshi News home page

భయం.. భయంగా..

Nov 1 2018 12:20 PM | Updated on Nov 1 2018 12:20 PM

KGBV Girls Fear In Without Compound Walls - Sakshi

ప్రహరీ లేకుండా.. ఊరికి దూరంగా ఉన్న నిమ్మనపల్లె కేజీబీవీ

బాలికలు.. ముఖ్యంగా అనాథలు.. మధ్యలోనే చదువు మానేసిన వారికి బంగారు భవిష్యత్‌  అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో భద్రత గాలిలో దీపంలా మారింది. పర్యవేక్షణ కొరవడడం, సీసీ కెమెరాలు ఉన్నా సరిగా పని చేయకపోవ డం, చాలా చోట్ల ప్రహరీలు నిర్మించకపోవడం వంటి కారణాల వల్ల బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. స్కూళ్లలోకి ఆగంతకులు చొరబడుతున్నారు. స్పెషలాఫీసర్లు నైట్‌డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు.

చిత్తూరు, సాక్షి: జిల్లా వ్యాప్తంగా 20 కేజీబీవీలున్నాయి. వీటిలో 3840 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. విద్యార్థినులకు తగినట్టు సిబ్బంది లేరు. 20 స్కూళ్లకు 20 మం ది స్పెషలాఫీసర్లు ఉన్నా.. వారిలో చాలా మంది నైట్‌డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. సబ్జెక్టు సీఆర్డీలు 20 మంది, పీఈటీలు 2, వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్లు, అకౌంటెంట్ల కొరత వేధిస్తోం ది.  కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లు, స్వీపర్, డే అండ్‌ నైట్‌ వాచ్‌మెన్, కుక్‌లు ఒక్కరు చొప్పున ఖాళీలున్నాయి. మరో ఐదుగురు పీఈటీలు కావాలి. జిల్లా వ్యాప్తంగా 27 ఖాళీలున్నాయి. దీనికి తోడు సిబ్బంది నిర్లక్ష్యం కూడా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. ఒక్కో కేజీబీవీలో 23 మంది స్టాఫ్‌ ఉండాలి. వీరిలో 10 మంది టీచింగ్, 13 మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఉండాలి. టీచింగ్‌ స్టాఫ్‌లో ఒకరు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఒకరురాత్రి పూట విధులు నిర్వర్తించాలి. 23 మందిలో ప్రతి ఒక్కరూ నైట్‌ డ్యూటీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో స్పెషలాఫీసర్‌ కూడా నెలలో ఒక రోజు నైట్‌ డ్యూటీ చేయాలి. ఇవి అమలు కావడం లేదు. తూతూ మంత్రంగా నైట్‌ డ్యూటీలు చేస్తున్నారు. ఎస్‌ఓలు కూడా చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారనే విమర్శలున్నాయి.

భద్రత గాలికి..
జిల్లాలో శాంతిపురం, రామకుప్పం, గంగవరం, బైరెడ్డిపల్లి, నిమ్మనపల్లి, కురుబలకోట, రామసముద్రం, కేవీబీపురం, గుడుపల్లి, కేవీపల్లి, యర్రావారిపాళ్యంలోని కేజీబీవీలకు ప్రహరీలు లేవు. చాలా స్కూళ్లకు రహదారి సమస్య కూడా ఉంది. వీటి గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ప్రహరీలు లేకపోవడంతో అపరిచిత వ్యక్తులు విద్యాలయాల్లోకి ప్రవేవిశిస్తున్నారని తెలుస్తోంది. ఇది బయటికి పొక్కకుండా స్కూల్‌ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్నిచోట్ల ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలోనూ, మరికొన్ని చోట్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి చాలాచోట్ల పని చేయడం లేదు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కేజీబీవీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కేవీబీపురం లాంటి చోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. నిమ్మనపల్లి స్కూలు గుట్టపైన ఉంది. దీనికి ప్రహరీ లేకపోవడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు.

తనిఖీలు నిర్వర్తించని ఎస్‌ఎస్‌ఏ అధికారులు..
ఎస్‌ఎస్‌ఏలోని జీసీడీఓ విభాగం అధికారులు నిత్యం కేజీబీవీలను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడి పరిస్థితులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే వారు చుట్టపు చూపుగా వెళుతున్నందునే కేజీబీవీల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తత్ఫలితంగా బాలికల భద్రత గాలిలో దీపంలా మారిందని విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రహరీలు, సీసీ కెమెరాలపై శ్రద్ధ పెట్టాలని పలువురు కోరతున్నారు.

10 కేజీబీవీలకు ప్రహరీ గోడలు లేవు
జిల్లాలోని 10 కేజీబీవీలకు ప్రహరీ గోడలు లేవు. వాటికి కూడా మంజూరు అయ్యా యి. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు సైతం జరుగుతున్నాయి. కేవీపల్లె కేజీబీవీలో అపరిచిత వ్యక్తులు వెళ్లారని చెప్పడం అబద్ధం. దీన్ని స్పెషల్‌ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాం. స్పెషల్‌ ఆఫీసర్లందరూ తప్పనిసరిగా కేజీబీవీలను సందర్శించాలి.    – శ్యామాలదేవి, జీసీడీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement