జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం


ఘనంగా నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు

 

నెల్లూరు (సెంట్రల్)  : భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. జగ్జీవన్‌రామ్ 108వ జయంతి సందర్భంగా వేదాయపాళెం సెంటర్లోని జగ్జీవన్‌రామ్ విగ్రహానికి ఎంపీ మేకపాటి, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, కిలివేటి సంజీవయ్య ఆదివారం ఘనంగా నివాళులర్పించారు.



ఈ సందర్భంగా ఎంపీ మేకపాటి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఎన్ని పదవులు చేపట్టినా అన్నింటికీ న్యాయం చేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ పట్టుదల, కృషితో దేశంలోనే అత్యున్నత స్థాయికి వచ్చారన్నారు. ఆయన చేసిన సేవలు మరువలేనవన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారన్నారు.



అటువంటి మహనీయులు కలలు సాకారం చేద్దామన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ భారతదేశ ఉప ప్రధానిగా దేశం గర్వించదగ్గ వ్యక్తిగా ఎదిగారన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని పోవాల్సిన అవసరం ఉందన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలసికట్టుగా ఉందామన్నారు.



జాయింట్ కలెక్టరు ఇంతియాజ్, సోషల్ వెల్ఫేర్ డీడీ ప్రసాద్‌రావు, ఐటిడీఏ పీఓ వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, గోగుల నాగరాజు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు సుధీర్‌బాబు, నాయకులు పురుషోత్తం యాదవ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నరసింహయ్య ముదిరాజ్, మురహరి, సునీల్, కెహరికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top