గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం సర్వేనంబర్ 690, పిడుగురాళ్ల గ్రామ సర్వేనంబర్ 1000, 1001లో సున్నపురాయి అక్రమ తవ్వకాలు నిజమేనని గనులు, భూగర్భశాఖ అంగీకరించింది.
- ‘యరపతినేని దందా నిజమే’ వార్తకు నిర్ధారణ
- లోకాయుక్త నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు: గనుల శాఖ
అమరావతి: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం సర్వేనంబర్ 690, పిడుగురాళ్ల గ్రామ సర్వేనంబర్ 1000, 1001లో సున్నపురాయి అక్రమ తవ్వకాలు నిజమేనని గనులు, భూగర్భశాఖ అంగీకరించింది. పిడుగురాళ్ల మండలంలో సున్నపురాయి అక్రమ తవ్వకాలకు అధికార టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్పడింది నిజమేనని లోకాయుక్త నిగ్గు తేల్చిందంటూ ‘సాక్షి’ వార్త ప్రచురించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గనులశాఖ సహాయ సంచాలకుడు బి.జగన్నాథరావు బుధవారం వివరణిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
లోకాయుక్త నిగ్గుతేల్చిందన్న విషయం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకాయుక్త నుంచి తమ శాఖకు ఎలాంటి ఆదేశాలు, నివేదికలు రాలేదని గనులశాఖ పేర్కొంది. అక్రమ తవ్వకాలు జరిగాయని అంగీకరించింది. ‘‘గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామం సర్వేనంబర్ 690, పిడుగురాళ్ల గ్రామ సర్వేనంబర్ 1000, 1001లో సున్నపురాయి అక్రమ తవ్వకాలు రవాణాను అరికట్టడానికి రెవెన్యూ, పోలీసు, గనులు, పంచాయితీరాజ్ అధికారులతో డివిజన్, మండల, గ్రామస్థాయిలో బృందాలు ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 24న కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ బృందాలు తరచూ తనిఖీలు చేసి, అక్రమ తవ్వకాలు జరగకుండా అరికట్టాయి’’ అని వివరణలో గనులశాఖ పేర్కొంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని, కలెక్టర్, ఎస్పీ, గనులశాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని లోకాయుక్త తన నివేదికలో బయటపెట్టడం తెలిసిందే. దీనిపై గనులశాఖ తన వివరణలో.. లోకాయుక్త నుంచి తవకు ఆదేశాలు రాలేదని, నివేదికలు ఇవ్వలేదంది తప్ప అక్రమ మైనింగ్ జరగలేదని పేర్కొనకపోవడం గమనార్హం. 2014 నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంటే.. 2016 మార్చి 24న అక్రమ మైనింగ్ నిరోధానికి ఉత్తర్వులిచ్చినట్లు పేర్కొన్నారు.