అందరూ ముందుకొస్తే పూర్వవైభవం | Hudood storm | Sakshi
Sakshi News home page

అందరూ ముందుకొస్తే పూర్వవైభవం

Oct 23 2014 1:04 AM | Updated on Sep 2 2017 3:15 PM

హుదూద్ తుపాను కారణంగా నష్టపోయిన విశాఖ నగర బ్రాండ్ ఇమేజ్‌ను నిలబెట్టేందుకు అందరూ ముందుకు రావాలని రాష్ట్రమానవవనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

విశాఖపట్నం : హుదూద్ తుపాను కారణంగా నష్టపోయిన విశాఖ నగర బ్రాండ్ ఇమేజ్‌ను నిలబెట్టేందుకు అందరూ ముందుకు రావాలని రాష్ట్రమానవవనరులశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. తుపానులను జయిద్దాం నినాదంతో బీచ్‌రోడ్‌లో జిల్లా యంత్రాంగం బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయస్థాయిలో పేరుగాంచి విశాఖను సుందరనగరంగా తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరి సహకారం అవసరమన్నారు.

హుదూద్ నుంచి తక్కువ రోజుల్లో ప్రజలను తేరుకునేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. పంచాయితీరాజ్‌శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ  విశాఖపునర్నిర్మాణంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ విశాఖను స్మార్ట్ సిటీగా చేయడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమన్నారు. దీని వెనుక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కృషి ఉందన్నారు.

హుదూద్ ప్రభావంతో చెదిరిన పచ్చదనం గురించి ఆందోళన చెందవద్దని.. ఆరు నెలల్లో 60శాతం పచ్చదనం కనబడుతుందన్నారు. అంతకుముందు ‘తుపానులను జయిద్దాం’ అనే నినాదంతో  కాగడా, కొవ్వొత్తుల ప్రదర్శన ఉత్సాహంగా సాగింది. బీచ్‌రోడ్ పాండురంగస్వామి ఆలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర పట్టణాభివృధ్దిశాఖామంత్రి వెంకయ్యనాయుడుతో కలిసి ప్రారంభించిన ఈ ర్యాలీ ఆర్ కె బీచ్  కాళీమాత ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సభాప్రాంగణం వరకూ సాగింది.  

కార్యక్రమంలో మంత్రులు కిమిడి మృణాళిణి, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, కింజారపు అచ్చంనాయుడు, పీతల సుజాత, కామినేని శ్రీనివాస్, పి.నారాయణ, రావెల కిశోర్‌బాబు, పల్లె రఘునాదరెడ్డి,ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, వాసుపల్లి గణేశ్‌కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ యువరాజ్ తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం తుపాను బాదితుల సహాయార్దం ఉద్యోగుల జేఏసి 8కోట్లు రూపాయిలు చెక్కును కలెక్టర్ చేతులు మీదుగా ముఖ్యమంత్రికి అందచేసారు.

Advertisement
 
Advertisement
Advertisement