హాస్టల్‌లో అర్ధాకలితో.. | hostel warden sales goods in black market | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో అర్ధాకలితో..

Feb 5 2014 4:25 AM | Updated on Sep 15 2018 3:07 PM

ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో 70 మంది విద్యార్థులున్నారు. అయితే వారి కి సరిపోయేంత భోజనాన్ని మాత్రం వడ్డించడంలేదు.

ఎల్లారెడ్డి, న్యూస్‌లైన్: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో 70 మంది విద్యార్థులున్నారు. అయితే వారి కి సరిపోయేంత భోజనాన్ని మాత్రం వడ్డించడంలేదు. నాలుగు కిలోల రవ్వతో ఉప్మా తయారు చేసి 70 మం ది విద్యార్థులకు వడ్డిస్తున్నారు. నాలుగు లీటర్ల పాల తోనే సరిపెడుతున్నారు. వారానికోసారి మాత్రమే గుడ్డు ఇస్తున్నారు. అన్నం కూడా సరిపోయేంత పెట్టడం లేదు.

 రాగి జావా, స్నాక్స్, సేమియా, పల్లిపట్టీలు విద్యార్థులకు ఇవ్వడం లేదు. మెనూ ప్రకారం కూరగాయలు కూడా వడ్డించడం లేదు. బియ్యంతో పాటు ఆయిల్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను వార్డెన్ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వసతి గృహంలో వైద్య సేవలు కూడా అందడం లేదు. ఏదైనా సమస్య తలెత్తితే ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటున్నారు.

 సోమవారం రాత్రి విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన తహశీల్దార్ మంగళవారం హాస్టల్‌లో విచారణ చేపట్టారు. ఆయనకు విద్యార్థులు పై విషయాలు తెలిపారు. టీవీకి సంబంధించిన డిష్ బిల్లు కూడా తమతోనే కట్టిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం బియ్యం బస్తాను తెప్పిం చి, బాత్‌రూమ్‌లో వేయించారన్నారు. వార్డెన్  హాస్టల్‌ లోంచి రోజూ సరుకులను కామారెడ్డికి తీసుకెళ్తారని ఆరోపించారు.

 స్టోర్ రూమ్ బయట సరుకులు..
 తహశీల్దార్ హాస్టల్‌లోని స్టోర్ రూమ్‌ను తెరిపించి స్టాకు వివరాలు పరిశీలించారు. విద్యార్థుల గదుల్లో 50 కిలోల బియ్యం సంచి కనిపించింది. బాత్‌రూమ్‌లోనూ బియ్యం బస్తా లభించింది. వార్డెన్ విజయలక్ష్మిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. నిత్యావసర వస్తువులు సైతం స్టోర్ రూమ్‌లో కాకుండా బయట లభించడంతో వాటిని సీజ్ చేశారు.

 విచారణ
 హాస్టల్‌లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదు. ఈ విషయమై విద్యార్థి సంఘాల నాయకులు సైతం వార్డెన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఏ విషయం అడిగినా వార్డెన్ సరైన సమాధానం ఇవ్వరని తహశీల్దార్‌తో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement