‘బాబుగారు మాట్లాడతారు’

‘బాబుగారు మాట్లాడతారు’ - Sakshi


- ‘బాస్’తో మాట్లాడించింది ఓ కేంద్ర మంత్రి

 

సాక్షి, హైదరాబాద్:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తెలుగుదేశం పార్టీ నిస్సిగ్గుగా సాగించిన బేరసారాల్లో ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి భాగస్వామ్యం బయటపడింది. ఎమ్మెల్యేలతో మాట్లాడడం దగ్గరి నుంచి కొనుగోళ్లకు సొమ్మును సమకూర్చేదాకా ఆయన కీలకపాత్ర పోషించినట్లు ఏసీబీ నిర్ధారించింది.



ఏపీ సీఎం చంద్రబాబుకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారిలో కీలక వ్యక్తిగా పరిగణించే ఈ కేంద్ర మంత్రి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సిద్ధం చేసింది. అంతేకాదు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ‘బాబుగారు మాట్లాడుతారు' అంటూ మాట్లాడించిందీ ఆ కేంద్ర మంత్రేనని గుర్తించింది. ఈ వ్యవహారంలో ఆ కేంద్ర మంత్రి భాగస్వామ్యానికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఆడియో, వీడియోలతో కేంద్ర హోంశాఖకు ఏసీబీ ఒక నివేదిక అందజేసినట్లు సమాచారం.



నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచమిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏపీకి చెందిన ఓ కేంద్ర మంత్రికి భాగస్వామ్యం ఉన్నట్లు ఏసీబీ తేల్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ దూత నేరుగా కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరవేసినట్లు అత్యున్నత అధికారవర్గాల సమాచారం.



ఈ ఆధారాల మేరకు ఆ కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. రేవంత్ అరెస్టు కావడానికి కొద్ది గంటల ముందు ఈ కేంద్ర మంత్రి పలు దఫాలుగా స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఆ క్రమంలోనే ‘బాబుగారు మాట్లాడుతార’ంటూ స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడించింది ఈ కేంద్ర మంత్రేనని ఆడియో రికార్డులను పరిశీలించిన ఏసీబీ నిర్ధారణకు వచ్చింది.



బాబుకు బినామీలుగా వ్యవహరిస్తున్న వారిలో ఈ కేంద్ర మంత్రిని కూడా కీలక వ్యక్తిగా పరిగణిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.5కోట్ల చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ముందస్తుగా రూ.50 లక్షల చొప్పున అడ్వాన్స్‌గా ఇచ్చే వ్యవహారంలో ఈ కేంద్ర మంత్రిది కీలకపాత్ర అని ఏసీబీ నిర్ధారించింది.



పోలింగ్‌కు రెండురోజుల ముందు..

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ కేంద్ర మంత్రి పలువురు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. అనుమానం వచ్చిన కొందరు ఎమ్మెల్యేల కాల్‌డేటాను తీసుకుని పరిశీలించిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా విచారణ జరిపిన ఏసీబీ ఆ కేంద్ర మంత్రికీ భాగస్వామ్యం ఉన్నట్లు తేల్చింది. ఈ కేంద్ర మంత్రి తన గన్‌మెన్, వ్యక్తిగత సిబ్బం దితో పాటు ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో పనిచేసే సిబ్బంది, చంద్రబాబు అధికారిక నివాసంలో పనిచేసే సిబ్బంది ఫోన్ల ద్వారా ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించారు.



పోలింగ్‌కు 4 రోజుల ముందు నుంచి ఈ కేంద్ర మంత్రి ఎవరి ఫోన్ల ద్వారా ఏయే ఎమ్మెల్యేతో ఎంత సేపు మాట్లాడారన్న పూర్తి వివరాలు ఏసీబీ కేంద్రానికి అందజేసిన నివేదికలో ఉన్నాయి. ఇద్దరు సహచర రాజ్యసభ సభ్యులతోనూ ఆయన మంతనాలు జరిపారని, డబ్బు సమకూర్చేందుకు ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలతోనూ మాట్లాడారని పేర్కొన్నట్లు తెలిసింది. ఆయన ఎమ్మెల్యేలతో బేరసారాలు చేసిన తీరుపై తెలంగాణ ప్రాంతానికి చెందిన టీఆర్‌ఎస్ ఎంపీ ఒకరు ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.



సీఎంతో కలిసి ఫైవ్‌స్టార్ హోటల్‌కు..

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందు అంటే రేవంత్ అరెస్టు కావడానికి కొద్ది గంటల ముందు చంద్రబాబుతో కలసి ఈ కేంద్ర మంత్రి 2 గంటల పాటు మాదాపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో బస చేసిన టీడీపీ-బీజేపీ శాసనసభ్యులతో గడిపారు. ఏసీబీ ఆ హోటల్ నుంచి వీడియో ఫుటేజీలను సేకరిం చింది. ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడమే కాకుండా నిధుల సేకరణకూ ఈ కేంద్ర మంత్రి తన పలుకుబడిని వినియోగించారని ఏసీబీ కేంద్రానికి ఇచ్చిన నివేదికలో వివరించింది. ఆయన తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్ల ద్వారా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడారని నిరూపించేందుకు కాల్‌డేటాను నివేదికకు జత చేసింది.



దాంతోపాటు మే చివరివారంలో డబ్బు లావాదేవీలకు సంబంధించిన కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను.. కేసులో రెండో నిందితుడు సెబాస్టియన్ తమ కస్టడీలో వెల్లడించిన అంశాలను, కేంద్ర మంత్రికి సంబంధించి ఇచ్చిన వాంగ్మూలాన్ని కూడా నివేదికకు జతచేసింది. రేవంత్ గన్‌మెన్‌లు ఇచ్చిన వాంగ్మూలంలోనూ పలుమార్లు కేంద్ర మంత్రి ప్రస్తావన వచ్చింది. మే చివరివారంలో రేవంత్, కేంద్ర మంత్రి ఎన్నిసార్లు కలిశారు వంటి వివరాలు వారి వాంగ్ములంలో ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top