విముక్తి కల్పించండి | Handloom weavers protest in front of MLA house | Sakshi
Sakshi News home page

విముక్తి కల్పించండి

May 21 2015 3:32 AM | Updated on Sep 3 2017 2:23 AM

బానిస సంకెళ్ల నుండి తమకు పూర్తిగా విముక్తి కల్పించాలని, గడ్డం సాయి నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని 250 కుటుంబాలు రోడ్డెక్కాయి.

గడ్డం సాయి ఆగడాలపై ధ్వజమెత్తిన చేనేత కార్మికులు
ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగిన వైనం
విముక్తి కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యం

 
 ధర్మవరం అర్బన్ : బానిస సంకెళ్ల నుండి తమకు పూర్తిగా విముక్తి కల్పించాలని, గడ్డం సాయి నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని 250 కుటుంబాలు రోడ్డెక్కాయి. రాత్రి 8గంటల సమయంలో ఏకంగా స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇంటినే ముట్టడించాయి.ధర్మవరం పట్టణంలో చేనేత పరిశ్రమను నడుపుతున్న గడ్డం సాయి తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని వారి ఆగడాలకు ప్రత్యక్ష నరకం చూస్తున్నామని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు.

రెండు రోజుల క్రితం చేనేత కార్మికులకు కల్పించినట్లుగానే మాకు కూడా విముక్తి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటల పాటు ఎమ్మెల్యే ఇంటిని చుట్టు ముట్టినా కూడా ఒక్క అధికారి కానీ, పోలీసులు కానీ వారిని పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ధర్నా చేశారు. స్పందించిన ఆర్డీవో తప్పకుండా రుణ విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. గడ్డం సాయి చేస్తున్న అరాచకాలపై కార్మికులు చెప్పిన మాటలు ఇవి.
 
 భర్త పారిపోయాడని కొడుకును కట్టేసుకున్నారు

 సాయి వేధింపులకు తాళలేక నా భర్త పారిపోయాడు. అయినా కూడా అప్పు తీర్చాలని ఇష్టం వచ్చినట్లు నన్ను కొట్టారు. పదవ తరగతి చదివే నా కుమారుడిని ఏకంగా కట్టేశారు. కాళ్లావేళ్లా పడినా కూడా కనికరించలేదు. ఉదయం 5 గంటలకే లేవాలి, లేదంటే కట్టెలతో కూడా కొడతారు. పదవ తరగతి చదువుతున్న నా కుమారుడితో ఇప్పుడు మగ్గం వేయిస్తున్నారు.       - అంజనాదేవి, చేనేత కార్మికురాలు
 
 అల్లుడికి బాగలేకపోతే రూపాయి ఇవ్వలేదు
 నా అల్లుడు కరెంట్ షాక్‌కు గురై ప్రమాదానికి లోనైతే వైద్యం చేయించుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గడ్డం సాయి కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించలేదు. చివరికి రూ.500 అడిగినా కూడా మీకేమన్న బాకీ ఉన్నామా అంటూ మాపై దాడి చేశారు.              
 - వెంకట నారాయణమ్మ
 
 వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాను

 గడ్డం సాయి రాక్షసుడి లా ప్రవర్తిస్తారు. ఇష్టం వచ్చినట్లు మాపై గు మాస్తాలతో దాడులు చేయిస్తారు. కాళ్లు ప ట్టుకున్నా కనికరించరు. ఇదెక్కడి న్యాయం మేము బానిసలు అనుకున్నారా? ఆయన వేధింపులు తాళలేక రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినా అయినా కూడా వదల్లేదు. మా గోడు పట్టించుకునేవారే లేరు.
 - పెద్దన్న, చేనేత కార్మికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement