breaking news
Mla gonuguntla suryanarayana
-
టీడీపీ ఎమ్మెల్యే అరాచకాలకు అంతు లేదు..
-
నన్ను గెలిపించండి.. ప్రత్యర్థులను నరుక్కోండి..
ధర్మవరం: ‘‘నన్ను గెలిపించండి.. ఎలక్షన్లు అయినాక ఆర్నెల్లు సమయం మీకు ఇడిసిపెడతా.. ఏం చేసుకుంటారో చేసుకోండి. చంపుతారా? కాళ్లు చేతులు ఇరుస్తారా.. పొడుస్తారా మీ ఇష్టం. అన్నీ నేను చూసుకుంటాను. ఈ ఐదేళ్లు శాంతియుతంగా ఉండాలనుకున్నాం. శాంతియుతంగా ఉంటే కొందరు బడాయి పడతున్నారు. ఆ బడాయిగాళ్లందరినీ కాళ్లు చేతులూ ఇరచాల్సిందే.. తప్పదు. కౌంటింగ్ పూర్తయిన వెంటనే పని మొదలుపెట్టండి. ప్రత్యర్థులను అంతమొందిస్తే తప్ప మనకు మనుగడ ఉండదు. మే 16 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు టైం ఇస్తాం’’.. ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పార్టీకి చెందిన ‘హార్డ్కోర్.. సాఫ్ట్కోర్’(ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తల్లో బలంగా బెదిరించే వారిలో రౌడీషీటర్లను హార్డ్కోర్ సభ్యులుగాను, చిన్నచితకా పనులు చేసేవారిని సాఫ్ట్కోర్ సభ్యులుగానూ విభజించారు) కార్యకర్తలతో జరిపిన అంతర్గత సమావేశంలో చేసిన వ్యాఖ్యలివీ.. అంతేగాక ప్రత్యర్థులను చంపుతుంటే అడ్డురాకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే ఆదేశిస్తానని సదరు టీడీపీ ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలో కీలకంగా పనిచేస్తున్న టీడీపీ నేతలైన మాజీ ఎంపీపీ, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిలేటి, కౌన్సిలర్ రాయపాటి రామకృష్ణ, గంటాపురం జగ్గు, బోయపాటి ప్రదీప్, నాగశేషయ్యలు ఎమ్మెల్యే ఆగడాలను భరించలేక బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వారు అనంతపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఎమ్మెల్యే బెదిరింపులకు సంబంధించిన ఆడియో టేపులను మీడియాకు విడుదల చేశారు. హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించేలా స్వయానా ఎమ్మెల్యే మాట్లాడిన వైనాన్ని వారు బహిర్గతం చేశారు. ఈ ఆడియో టేపులు జిల్లాలో, నియోజకవర్గంలో పెను సంచలనమయ్యాయి. ఎమ్మెల్యే అరాచకాలకు అంతు లేదు.. ధర్మవరం ఎమ్మెల్యే అఘాయిత్యాలను టీడీపీ నేతలు ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. ఆయన అరాచకాలకు అంతులేదన్నారు. నియోజకవర్గంలో తన కోటరీని ఏర్పాటు చేసుకొని వసూళ్ల దందాకు తెరలేపారని ఆరోపించారు. ధర్మవరంలో ప్రత్యేకంగా సూరీ జీఎస్టీ చెల్లిస్తేనే పనులు సాగుతాయన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడన్నారు. ‘‘భూముల్ని దౌర్జన్యంగా రైతుల్నుంచీ లాగేసుకుంటున్నాడు. ఆయన అరాచకాలను ప్రశ్నించేవారిపై పోలీసులతో అక్రమ కేసులు బనాయింపచేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. టీడీపీలో ఉన్నా మాకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టుగానే ఉంది. మాపైనా అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నాడు. రైల్వేస్టేషన్లో టీ అమ్ముకునే దగ్గర నుంచి పెద్ద పెద్ద టెండర్ల వరకు ఆయనకు కమీషన్లు ముట్టజెప్పందే పనులు దక్కవు. ఎవరైనా పనులు దక్కించుకుంటే తన అనుచరులతో వారిపై దాడులు చేయించి బలవంతపు వసూళ్లు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు’’ అని వారు తెలిపారు. ఆయన అరాచకాలు, వేధింపుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరక్కపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సూరి ఓటమి లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో ఇంకా శంకర్, నరసింహులు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
విముక్తి కల్పించండి
గడ్డం సాయి ఆగడాలపై ధ్వజమెత్తిన చేనేత కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగిన వైనం విముక్తి కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యం ధర్మవరం అర్బన్ : బానిస సంకెళ్ల నుండి తమకు పూర్తిగా విముక్తి కల్పించాలని, గడ్డం సాయి నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని 250 కుటుంబాలు రోడ్డెక్కాయి. రాత్రి 8గంటల సమయంలో ఏకంగా స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇంటినే ముట్టడించాయి.ధర్మవరం పట్టణంలో చేనేత పరిశ్రమను నడుపుతున్న గడ్డం సాయి తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని వారి ఆగడాలకు ప్రత్యక్ష నరకం చూస్తున్నామని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు రోజుల క్రితం చేనేత కార్మికులకు కల్పించినట్లుగానే మాకు కూడా విముక్తి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటల పాటు ఎమ్మెల్యే ఇంటిని చుట్టు ముట్టినా కూడా ఒక్క అధికారి కానీ, పోలీసులు కానీ వారిని పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ధర్నా చేశారు. స్పందించిన ఆర్డీవో తప్పకుండా రుణ విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. గడ్డం సాయి చేస్తున్న అరాచకాలపై కార్మికులు చెప్పిన మాటలు ఇవి. భర్త పారిపోయాడని కొడుకును కట్టేసుకున్నారు సాయి వేధింపులకు తాళలేక నా భర్త పారిపోయాడు. అయినా కూడా అప్పు తీర్చాలని ఇష్టం వచ్చినట్లు నన్ను కొట్టారు. పదవ తరగతి చదివే నా కుమారుడిని ఏకంగా కట్టేశారు. కాళ్లావేళ్లా పడినా కూడా కనికరించలేదు. ఉదయం 5 గంటలకే లేవాలి, లేదంటే కట్టెలతో కూడా కొడతారు. పదవ తరగతి చదువుతున్న నా కుమారుడితో ఇప్పుడు మగ్గం వేయిస్తున్నారు. - అంజనాదేవి, చేనేత కార్మికురాలు అల్లుడికి బాగలేకపోతే రూపాయి ఇవ్వలేదు నా అల్లుడు కరెంట్ షాక్కు గురై ప్రమాదానికి లోనైతే వైద్యం చేయించుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గడ్డం సాయి కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించలేదు. చివరికి రూ.500 అడిగినా కూడా మీకేమన్న బాకీ ఉన్నామా అంటూ మాపై దాడి చేశారు. - వెంకట నారాయణమ్మ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాను గడ్డం సాయి రాక్షసుడి లా ప్రవర్తిస్తారు. ఇష్టం వచ్చినట్లు మాపై గు మాస్తాలతో దాడులు చేయిస్తారు. కాళ్లు ప ట్టుకున్నా కనికరించరు. ఇదెక్కడి న్యాయం మేము బానిసలు అనుకున్నారా? ఆయన వేధింపులు తాళలేక రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినా అయినా కూడా వదల్లేదు. మా గోడు పట్టించుకునేవారే లేరు. - పెద్దన్న, చేనేత కార్మికుడు