
ఒంగోలు: సోమవారం నుంచి పాఠశాలలు మధ్యాహ్నం 12.30గంటల వరకే నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు వేసవి వచ్చిందని, కనుక విద్యార్థులు ఎండకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఒంటిపూట బడులను ఈ నెల 12నుంచి నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ఉదయం 7.45గంటలకు మొదటి బెల్, రెండో బెల్ 7.50గంటలకు , ప్రేయర్ అనంతరం మూడో బెల్ 8గంటలకు మోగించాలన్నారు.
అనంతరం ఆరు పీరియడ్లు నిర్వహించి మధ్యాహ్నం 12.30గంటలకు తరగతులు ముగించాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 180 పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్న దృష్ట్యా 6 నుంచి 9తరగతుల వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు. అంతేగాక పలు ప్రైవేటు పాఠశాలల పరీక్షా కేంద్రాల్లో 1 నుంచి 5 తరగతుల వరకు పాఠశాల నిర్వహించుకునేందుకు లేదా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించాలని డీఈఓ ఆదేశించారు.