ఆ పెద్దోళ్లున్నారే..! | grain Purchase Irregularities in Vizianagaram marketing | Sakshi
Sakshi News home page

ఆ పెద్దోళ్లున్నారే..!

Mar 9 2015 1:23 AM | Updated on Sep 2 2017 10:31 PM

ధాన్యం కొనుగోలులో అక్రమాల భాగోతం. జిల్లా ఇటీవల పెద్ద కలకలమే సృష్టించింది. అయితే ఈ బాగోతంలో సూత్రధారులు,

సాక్షి ప్రతినిధి, విజయనగరం:ధాన్యం కొనుగోలులో అక్రమాల భాగోతం. జిల్లా ఇటీవల పెద్ద కలకలమే సృష్టించింది. అయితే ఈ బాగోతంలో సూత్రధారులు, సలహాదారులు మాత్రం తమకేమీ కాదన్నట్లు వ్యవహరిస్తుంటే కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం బలైపోతున్నారు. ఏదైనా కుంభకోణం కానీ, అక్రమ వ్యవహారం కానీ జరిగినప్పుడు ఎటువంటి వ్యవహరంలోనైనా చిన్న తలకాయలే బలిపశువులవుతున్నాయి.   
 
 రూ.కోట్లు వెనకేసుకున్నోళ్లు వ్యూహాత్మకంగా తప్పించుకుంటున్నారు. అక్రమాలకు గేట్లెత్తిన అధికారుల వ్యవహారం బయటకు రావడం లేదు. ఉన్నతస్థాయి వ్యక్తుల జోలికే వెళ్లడం లేదు. అక్రమాల వ్యవహారాలో నిగ్గు తేల్చే విచారణల సందర్భంగా జిల్లా ప్రజల అభిప్రాయాలివి. ధాన్యం కొనుగోలులో జరిగిన అక్రమాలపై తీసుకుంటున్న చర్యలు గమనిస్తుంటే జిల్లా ప్రజల అభిప్రాయాలను కొట్టిపారేయలేని పరిస్థితి. సంబంధిత ఉద్యోగ వర్గాల నుంచి కూడా ఇవే రకమైన వాదనలు విన్పిస్తున్నాయి.  గంట్యాడ మండలంలోని శ్రీ సాయి వరలక్ష్మి ఆగ్రోఫుడ్స్ మిల్లులో  అక్రమాలు జరిగాయని, ధాన్యం రవాణాకు సంబంధించి అడ్డగోలుగా ట్రక్‌షీట్లు జారీ చేశారన్న అభియోగాలతో ఆ మండలం హెచ్‌డీటీ కె.మసీన్‌రావు, నీలావతి వీఆర్‌ఓ శంకర్రావులపై  సస్పెన్షన్  వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 తప్పు చేశారన్న కారణంతో వీరిపై చర్యలు తీసుకోవడం సరైనదే కానీ..ఇందులో సూత్రధారులు చాలా మంది ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ వ్యవహారం ఒక్క శ్రీ సాయి వరలక్ష్మి ఆగ్రోఫుడ్స్ విషయంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా జరిగిన ధాన్యం కొనుగోలు అక్రమాల భాగోతంలో   ఉన్నత స్థాయి వ్యక్తులే కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో కీలక అధికారుల అంతర్గత ఆదేశాలు లేకుండా ఏమీ జరగలేదన్న వాదనలు ఉన్నాయి. అధికారులు, పలు శాఖల సిబ్బంది,  పలువురు మిల్లర్లు కుమ్మక్కై ఈ దందాకు పాల్పడినట్టు  బయటకు వెల్లడైన పరిణామాల బట్టి స్పష్టమవుతోంది.
 
 అధికారులకే తెలియాలి..
 ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన ట్రక్‌షీట్లు మిల్లర్లకు చేతికి ఎలా వెళ్లాయి? ట్రక్‌షీట్ల పుస్తకాలు మిల్లర్ల వద్దకు వెళ్లడానికి కారకులెవరు? సీరియల్ నంబరు లేకుండా లెక్కాడొక్కా లేకుండా ట్రక్‌షీట్లు ముద్రించిందెవరు? ఐకేపీ, సివిల్ సప్లైస్, రెవెన్యూ సిబ్బంది రాసి ఇవ్వాల్సిన ట్రక్‌షీట్లను మిల్లర్లు ఎలా రాసిచ్చారు? ఇవన్నీ సంబంధిత అధికారులకు తెలియకుండా జరిగిందా?  ఇలా ప్రశ్నిస్తే వీటిపై ఉన్నతాధికారుల వద్ద సమాధానమే లేదు. ఇక, సం తల్లో చీటీల్లా సాగు ధ్రువీకరణ పత్రాలు చెలామణిలోకి వచ్చాయంటే అధికారులకు సంబంధం లేకుండా  జరిగిపోయిందా?   ఇదంతా ఒక ఎత్తు అయితే ఎకరాకు 1200బస్తాల ధాన్యం పం డించినట్టు, వాటిని కొనుగోలు చేసినట్టు లెక్కలు చూపిస్తున్నాయి. ఆ స్థాయిలో పంట పండించే రైతులెక్కడున్నారో సదరు అధికారులే తేల్చాలి.
 
 ఒకే మిల్లర్ తన బంధువుల పేరున ట్రక్‌షీట్లు రాసుకుని, రూ.లక్షలాది రూపాయలు డ్రా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. కానీ, ఆ దిశగా విచారణే జరగడం లేదు. పత్రికల్లో కథనాలొచ్చినప్పుడు  మత్రం భుజాలు తడుముకుంటూ విచారణకు ఆదేశించామని చెబుతున్నారే తప్ప వాస్తవ పరిస్థితులు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరగడం లేదు. అసలీ విచారణలపై కూడా విమర్శలొస్తున్నాయి. ఎవరికైతే ఇందులో ప్రమేయం ఉందని ఆరోపణలొస్తున్నాయో వారే విచారణాధికారులగా వ్యవహరిస్తున్నారన్న  ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవర్నో ఒకర్ని ఇరికించి, ఫైలు మూసేస్తే సరిపోతుందనే ధోరణితో విచారణ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
 

Advertisement

పోల్

Advertisement