భారతదేశం వేదాలకు నిలయం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్
పుట్టపర్తి అర్బన్: భారతదేశం వేదాలకు నిలయమని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. సత్యసాయి 92వ జయంతి వేడుకలను పురస్కరించుకొని అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ వేద సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తికి గవర్నర్ చేరుకున్నారు.
మొదట సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం సదస్సులో మాట్లాడుతూ.. శాంతి, ప్రేమ, ధర్మాలను స్థాపించడం వేద అధ్యయనంతోనే సాధ్యమన్నారు. వేడుకల్లో 42 దేశాలకు చెందిన 15 వేల మంది వేద పండితులు హాజరై వేదపారాయణం చేశారు.