రాజధాని నిర్మాణానికి నయానో భయానో 33,347 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్న ప్రభుత్వం వారితో దోబూచులాడుతోంది.
తాడికొండ : రాజధాని నిర్మాణానికి నయానో భయానో 33,347 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్న ప్రభుత్వం వారితో దోబూచులాడుతోంది. కౌలు చెల్లింపుపై తాత్సారం చేస్తోంది. జనవరి 1 నుంచి రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో భూసమీకరణ చేట్టిన ప్రభుత్వం నేటికీ ఏ భూములు ఏ విభాగానికి చెందినవన్న స్పష్టమైన సమాచారాన్ని పొందుపరచలేదు. భూములు సమీకరణకు ఇచ్చిన రైతులు పరిహారం అందక అవస్థలు పడుతున్నారు.
అసలేం జరిగిందంటే...
1916-20 మధ్య రాజధాని ప్రాంతంలోని నీరుకొండ, కురగల్లు, నిడమర్రు, కృష్ణాయిపాలెం, వెంకటపాలెం, మండదం గ్రామాల్లోని మాజీ సైనికులకు, పేదలకు 1400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. వీరిలో కొందరు ఆర్థిక ఇబ్బందులతో ఇతరులకు విక్రయించుకోగా, మిగిలిన వారు పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగళ్లు పొంది సాగు చేసుకుంటున్నారు. భూసమీకరణను ప్రకటించటంతో వీరంతా 9.3 అంగీకార పత్రాలు ఇచ్చారు.
వీరిలో కొందరికి ప్రభుత్వం కౌలు డీడీలు కూడా పంపిణీ చేసింది. అసైన్డ్, అటవీ భూముల్ని తీసుకుంటే కౌలు పరిహారం తగ్గుతుందని రైతులకు చెప్పకుండా గోప్యంగా ఉంచింది. అంతకు ముందు ఇచ్చిన డీడీలు ఇచ్చి వేయాలంటూ ఈనెల 2,3 తేదీల్లో పంచాయతీ కార్యాలయాల్లో నోటీసు పెట్టింది. అయితే, అసలు 6 తేదీ భూమి పూజకు ఎక్కడ వ్యతిరేకత వస్తోందని కొందరు టీడీపీ నేతలు బోర్డులో ఉన్న పత్రాల్ని తొలగించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
కౌలు పరిహారం అందకుంటే సేద్యానికి వెళతాం..
తమకు కౌలు పరిహారం అందించకుంటే తప్పకుండా సేద్యానికి వెళతామని మంగళవారం మందడంలో నిర్వహించిన రైతు సమావేశంలో రైతులు ముక్తకంఠంతో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్కు విన్నవించారు. తమకు సాగు లేక కౌలు పరిహారం లేకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయని వివరించారు. ఈ సమస్యను 2011 జనవరిలో మంగళగిరి మండలం నీరుకొండ గ్రామానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వచ్చిన చంద్రబాబుతో చెప్పగా.. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని ప్రస్తుతం ఇలా చేయటం సరికాదని నీరుకొండ గ్రామానికి చెందిన రైతు నరేంద్ర సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే కౌలు పరిహారం చెల్లించాలని, లేదంటే తమ భూములు సేద్యం చేసుకుంటామని హెచ్చిరించారు.