వైద్యులకు మెడల్‌పై కత్తి? | Government doctors stress on tdp govt | Sakshi
Sakshi News home page

వైద్యులకు మెడల్‌పై కత్తి?

Feb 25 2016 12:42 AM | Updated on Sep 3 2017 6:20 PM

ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం వైద్యులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం

విజయనగరంఫోర్ట్: ప్రైవేటు సంస్థకు లబ్ధి  చేకూర్చడానికి ప్రభుత్వం  వైద్యులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఇటీవల ఎన్‌టీఆర్  ఉచిత వైద్య పరీక్షలు  పథకాన్ని చేపట్టింది. ఈపథకం నిర్వహణను మెడాల్ సంస్థకు అప్పగిచ్చింది.  ప్రభుత్వ ఆస్పత్రు లకు వచ్చే రోగులకు  ఉచిత వైద్య పరీక్షలు చేయాలన్నది పథక ఉద్దేశ్యం. జిల్లా ఆస్పత్రిలో 44 రకాలు, సీహెచ్‌సీలో 22 రకాలు, పీహెచ్‌సీలో 15 రకాలు వైద్య పరీక్షలు చేస్తున్నారు.
 
 ఒక రోగికి రూ.236 చెల్లిస్తున్న ప్రభుత్వం
 ఒక రోగికి వైద్య పరీక్షలు చేయడానికి మెడాల్ సంస్థకు ప్రభుత్వం రూ.236  చెల్లిస్తుంది. అది ఒక టెస్టు అయినా, 10 టెస్టులకు అయినా  రూ.236 చెల్లించాల్సిందే.
 
 మెడాల్‌కే అధిక పరీక్షలు రాయాలని ఒత్తిడి
 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన వైద్యపరీక్షలు చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా  కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రిల్లో  అయితే మెడాల్ సంస్థ చేస్తున్న టెస్టుల్లో ఒకటి రెండు మినహా అన్ని వైద్య పరీక్షలు ఉన్నాయి. దీంతో వైద్యులు ప్రభుత్వ ల్యాబొరేటరీకి వైద్య పరీక్షలు రాస్తున్నారు. ఇది రుచించని మెడాల్ సంస్థ నిర్వాహకులు వైద్య విధాన్ పరిషత్, వైద్య ఆరోగ్యశాఖ  ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
 
  దీంతో ఉన్నతాధికారులు మెడాల్ సంస్థకు వైద్య పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తున్నట్లు భోగట్టా.అసవరం లేకుండా పరీక్షలు ఏవిధంగా రాయగలమని కొంతమంది వైద్యులు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అదంతా తెలియదు   వైద్య పరీక్షలు  ఆ సంస్థకు రాయాల్సిందేనని వైద్యులను గట్టిగా హెచ్చరించినట్టు భోగట్టా. దీంతో తమకు ఎందుకొచ్చిన తంటా అని వైద్యులు వైద్య పరీక్షలు రాసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు  తెలిసింది.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే  ఎటువంటి ఇబ్బందులు  ఎదుర్కోవాల్సి వస్తుందోనని వైద్యులు భయపడుతున్నారు.
 
 ప్రచారమే తప్ప ప్రయోజనం చూడని ప్రభుత్వం
 ఎన్‌టీఆర్ వైద్య పరీక్షలు పథకాన్ని ప్రవేశపెట్టాం.   రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడం తప్ప, ప్రైవేటు సంస్థకు అప్పగించడం వల్ల  ఎంత ప్రయోజనం చేకూరుతుందనేది ప్రభుత్వం అలోచించడం లేదు.  మెడాల్ సంస్థ చేస్తున్న వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేసే సిబ్బంది, పరికరాలు కూడా ఉన్నాయి.   ల్యాబొరేటరీలను ఒకరిద్దరు సిబ్బందిని నియమించుకుంటే సరిపోతుంది. కానీ ఇటువంటి ప్రయోజనాలను గుర్తించకుండా ప్రైవేటు సంస్థలకు లబ్ధిచేకూర్చేవిధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోం దనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.   మెడాల్‌కు వైద్య పరీక్షలు రాయాలని ఒత్తిడి తెస్తున్నారట కదా అని  డీసీహెచ్‌ఎస్ కె.సీతారామరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా నో కామెంట్ అని బదులివ్వడం విశేషం.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement