ఉపాధ్యాయులకు శుభవార్త | good news to teachers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు శుభవార్త

Jan 5 2014 2:39 AM | Updated on Sep 2 2017 2:17 AM

రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 28న జరిగిన సార్వత్రిక సమ్మెను అర్హత ఉన్న సెలవుగా పరిగణించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీవీ సత్యనారాయణరాజు, కేవీ శేఖర్ వెల్లడించారు.

 రాజానగరం, న్యూస్‌లైన్ : రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 28న జరిగిన సార్వత్రిక సమ్మెను అర్హత ఉన్న సెలవుగా పరిగణించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీవీ సత్యనారాయణరాజు, కేవీ శేఖర్ వెల్లడించారు. శనివారం వారిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన జీఓను వారం, పది రోజుల్లో విడుదల చేస్తామని సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కే సిన్హా తెలిపారన్నారు.

సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం శాఖాపరమైన నిర్ణయం తీసుకోవాలని హైకోర్డు ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. దీనిపై ఎస్‌కే సిన్హాను ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి కలిసి వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరడంతో.. త్వరలోనే జీఓను విడుదల చేసేందుకు ఆయన అంగీకరించారన్నారు. తద్వారా ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారికే కాకుండా, పదవీ విరమణ చేసిన, చేయబోయే వారికి కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు.

 ఇంక్రిమెంట్లు పొందేందుకు మార్గం సుగమం
 గొల్లప్రోలు, న్యూస్‌లైన్ : ఒక రోజు సమ్మె కాలానికి ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువడించినట్టు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, గొల్లప్రోలు మండల శాఖ అధ్యక్షుడు కె సత్తిరాజు, కె కాశీవిశ్వనాథ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్జిత సెలవు మంజూరు చేయాలని యూటీఎఫ్ అభ్యర్థన మేరకు ప్రభుత్వం  హైకోర్టులో అఫిడవిట్ దాఖల చేసిందన్నారు. దానిపై కోర్టు శనివారం తీర్పు వెలువరించిందన్నారు. జిల్లాలోని 4 వేల మంది ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్లు పొందేందుకు మార్గం సుగమమైందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement