అమానుషం.. | Sakshi
Sakshi News home page

అమానుషం..

Published Mon, Jan 13 2014 3:38 AM

former Army employee murder

హైదరాబాద్, న్యూస్‌లైన్: అయిన వారే కాలయములయ్యారు. భార్య, కుమారులు, బావమరిది కలిసి ఆర్మీ మాజీ ఉద్యోగిని మెడ నరికి దారుణంగా చంపేశారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, ఆస్తి తగదాలే ఈ హత్యకు కారణమని తెలిసింది. స్థానికంగా తీవ్ర  కలకలం సృష్టించిన ఈ ఘటన ఆదివారం హైదరాబాద్‌లోని శ్రీనివాసపురంలో జరిగింది. సీఐ లక్ష్మీకాంత్‌రె డ్డి, స్థానికుల కథనం ప్రకారం... ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకివీడు గ్రామానికి చెందిన నందమూరి చిన్న వెంకటరెడ్డి(55) నగరానికి వచ్చి శ్రీనివాసపురంలో స్థిరపడ్డారు.
 
 ఈయనకు భార్య చెన్నమ్మ, కుమారులు వెంకట రమణారెడ్డి(30), విజయకుమార్‌రెడ్డి(27), కుమార్తె రమాదేవి(28) ఉన్నారు. పిల్లలు ముగ్గురూ ఉన్నత చదువులు అభ్యసించారు. ఆర్మీలో పని చేసిన వెంకటరెడ్డి పదవీ విరమణ తర్వాత ఇక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన నేషనల్ ఇన్సూరెన్స్ కంపనీలో పని చేస్తున్నారు. వెంకటరెడ్డికి రామంతాపూర్‌లో రెండు ఇళ్లు, బోడుప్పల్‌లో రెండు పాట్లు, స్వగ్రామంలో పొలం ఉంది. ఏడాదిన్నర క్రితం రామంతాపూర్‌లోని ఇల్లును అమ్మకానికి పెట్టగా భార్య ఒప్పుకోలేదు.  దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలై తారస్థాయికి చేరాయి. గతంలో రెండుసార్లు వెంకటరెడ్డిపై భార్య ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది.
 
 పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిలో విభేదాలు తగ్గలేదు. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డి కొంతకాలంగా కోఠిలోని లాడ్జిలో ఉంటున్నారు. 20 రోజుల క్రితం స్థానిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భార్యాభర్తలు రాజీ కుదుర్చుకున్నారు. ఇకపై ఎలాంటి గొడవలు పడకుండా కలిసుందామని ఒట్టుపెట్టుకొని.. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. అయినా.. ఇద్దరి మధ్య గొడవలు తగ్గలేదు. భర్తపై పగ పెంచుకున్న భార్య అతడిని అంతం చేయాలని నిర్ణయించుకుంది. కొడుకులు, తన సోదరుడు భాస్కర్‌రెడ్డి (మాజీ ఆర్మీ ఉద్యోగి) తో కలిసి భర్త హత్యకు పథకం వేసింది. ఇందులో భాగంగా మాట్లాడుకుందామని వెంకటరెడ్డిని ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించారు. మాటల్లో పెట్టి వేటకోడవలితో మెడ నరికారు. కడుపులో పొడిచి, తలపై రోకలి బండతో మోది చంపేశారు. హత్య అనంతరం నిందితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. మల్కాజిగిరి ఏసీపీ చెన్నయ్య, ఉప్పల్ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, డీఐ వెంకటరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
Advertisement