వరద పగ సమైక్య సెగ | floods are destroyed lifes | Sakshi
Sakshi News home page

వరద పగ సమైక్య సెగ

Aug 9 2013 2:39 AM | Updated on Aug 15 2018 9:06 PM

కొబ్బరికి.. ఇటు అరటికి ఎనలేని డిమాండ్ ఉండేది శ్రావణమాసంలోనే. ఇందు కు తగ్గట్టుగా కొబ్బరి రైతులు ఈ సమయానికి అమ్ముకునేలా పచ్చికాయను, కురిడీ కొబ్బరిని నిల్వ చేస్తారు. అరటి రైతులు ఈ సీజన్‌లో గెలలు తెగేలా సాగు చేస్తారు. అయితే అటు గోదావరి వరదలు.. ఇటు సమైక్యాంధ్ర ఉద్య మం కొబ్బరి.. అరటి రైతులను దెబ్బతీసింది.

అమలాపురం, న్యూస్‌లైన్ : కొబ్బరికి.. ఇటు అరటికి ఎనలేని డిమాండ్ ఉండేది శ్రావణమాసంలోనే. ఇందు కు తగ్గట్టుగా కొబ్బరి రైతులు ఈ సమయానికి అమ్ముకునేలా పచ్చికాయను, కురిడీ కొబ్బరిని నిల్వ చేస్తారు. అరటి రైతులు ఈ సీజన్‌లో గెలలు తెగేలా సాగు చేస్తారు. అయితే అటు గోదావరి వరదలు.. ఇటు సమైక్యాంధ్ర ఉద్య మం కొబ్బరి.. అరటి రైతులను దెబ్బతీసింది.


శ్రావణమాసం వచ్చిందో, లేదో బహిరంగ మార్కెట్‌లో పచ్చి కొబ్బరికాయ ధర అమాంతంగా పెరిగింది. పెళ్లిళ్లు, శుభమూహూర్తాల సీజన్ కావడంతో పచ్చికాయకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మొన్నటి వరకు వెయ్యి కాయల ధర రూ.4,500 వరకు ఉండగా, ఇప్పుడది రూ.5 వేలకు చేరింది. ముక్కుడు కాయ ధర సైతం పెరిగింది. గోదావరి వరదల వల్ల ఉభయగోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల్లో వేలాది కొబ్బరికాయలు ఉండిపోయాయి. బయటకు వచ్చే మార్గంలేకపోవడంతో డిమాండ్ పెరిగి ధర పెరిగింది. సాధారణంగా శ్రావణం నుంచి వినాయక చవితి వెళ్లే వరకు మార్కెట్ జోరుగా ఉంటుం ది. ఈ సీజన్‌లో జిల్లా నుంచి రోజుకు 70 లారీల పచ్చికాయ ఎగుమతి జరుగుతుంటుంది. ఈసారి సమైక్య ఉద్యమం కారణంగా రోజుకు 20 లారీలకన్నా తక్కువగా కొబ్బరి ఎగుమతి అవుతోందని చెబుతున్నారు.


అరటి కుదేలువరదలు, సమైక్య ఉద్యమం కారణంగా అరటి ఎక్కువగా దెబ్బతింది. వరదల వల్ల 40 శాతం దిగుబడి పోయింది. వరద ప్రభావం ఇప్పటికన్నా అక్టోబరు, సెప్టెంబరులో ఎక్కువగా ఉంటుంది. లంకల్లో ముంపునీరు ఉండడంతో పక్వానికి వచ్చిన గెలలను సేకరించేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందుబాటులో ఉన్న గెలలను మాత్రమే రైతులు ఎగుమతి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి తగ్గుతోంది. శ్రావణం రావడంతో స్థానికంగా వినియోగం పెరుగుతుంది. చెన్నై, కేరళ, కోల్‌కతాలకు 24 గంటల్లోగా సరుకు అందాల్సి ఉంది. సమైక్య ఉద్యమాల వల్ల రవాణాకు అవాంతరాలు ఏర్పడుతుండడంతో గెలలు రంగు వచ్చి ధర తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో రోజుకు 40 వేల గెలలు ఎగుమతి అయ్యేవి. వరదలు, సమైక్య ఉద్యమ ప్రభావం వల్ల ఇప్పుడు 15 వేల నుంచి 20 వేల గెలలకు మించడం లేదు. ప్రస్తుత మార్కెట్‌లో కర్పూరం గెల రూ.100 నుంచి రూ.250 వరకు, చక్రకేళి తెలుపు రూ.100 నుంచి రూ.300 వరకు, ఎరుపు చక్రకేళి రూ.150 నుంచి రూ.350, అమృతపాణి రూ.150 నుంచి రూ.300 వరకు, భుషావళి రూ.100 నుంచి రూ.200 వరకు, కూర అరటి రూ.150 నుంచి రూ.300 వరకు ఉంది. ఉద్యమ ఉద్ధృతి ఆగకుంటే ధరలు మరింత పెరిగే అవకాశముందని రైతులు, వ్యాపారులు భావిస్తున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement