ఫీజు పోరు | Fighting fees | Sakshi
Sakshi News home page

ఫీజు పోరు

Oct 30 2014 2:49 AM | Updated on Sep 2 2017 3:34 PM

ఫీజు పోరు

ఫీజు పోరు

ఆదోని రూరల్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు.

ఆదోని రూరల్:  ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కదం తొక్కారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి దాదాపు 2వేల మంది విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. దాదాపు గంటపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రామనాయుడు మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

విద్యాభివృద్ధికోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫీజులను రీయింబర్స్ చేయడం లేదని విమర్శించారు. కళాశాలలో చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేయకపోవడం వల్ల యాజమాన్యాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.2400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయీలు ఉన్నాయన్నారు.

మరోవైపు - స్కాలర్‌షిప్ అందకపోవడం వల్ల పేద విద్యార్థుల చదువుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ప్రభుత్వం విద్యార్థుల్లో ఉన్న భయాందోళనలను తొలగించడంతోపాటు బకాయి ఉన్న ఫీజులను రీయిం బర్స్ చేయాలని, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.

త్వరలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు నాగరాజు, చిన్నా, మురళి, పట్టణ అధ్యక్షుడు రాజ్‌కుమార్, కార్యదర్శి రవి, డివిన్ నాయకులు ఇషాక్, మల్లి, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement